రాజన్న సిరిసిల్ల జూన్ 16
కేసీఆర్ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వమని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్, గొల్లపల్లి ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదలకోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షల్లో డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టించి ఇచ్చామని అన్నారు.‘‘పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వమే పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి ఇస్తున్నది. పారదర్శకంగా ఇండ్లను పంపిణీ చేస్తున్నాం. నిరుపేదల మొహాల్లో సంతోషం చూడడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వడం లేదు. త్వరలో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తాం’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో రోడ్డు-భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.