YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రఘురామ పరారీలో ఉన్నారా....

రఘురామ పరారీలో ఉన్నారా....

గుంటూరు, జూన్ 17,
రాజద్రోహం కేసులో అరెస్టయి సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేయడంతో బయటపడిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఎలాగైనా గుంటూరు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్‌ ఆర్డర్‌పై సంతకం చేయలేదన్న సాంకేతిక కారణంతో ఆయనపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతనెల 21న సుప్రీంకోర్టు ఎంపీ రఘురామకు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన 10 రోజుల్లో గుంటూరులోని సీఐడీ కోర్టుకు బెయిల్‌ బాండ్లు సమర్పించాలని ఆదేశించింది. అయితే 24వ తేదీన రఘురామ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి నేరుగా ఢిల్లీకి వెళ్లిపోయారు. 28న రఘురామ తరఫు న్యాయవాదులు గుంటూరులోని సీఐడీ కోర్టులో ష్యూరిటీలు సమర్పించగా కోర్టు వాటిని ఆమోదించింది. సీఐడీ కోర్టు రఘురామ బెయిల్‌కు సంబంధించి రిలీజ్‌ ఆర్డర్‌ను గుంటూరు జిల్లా జైలుకు పంపింది. ఆ పత్రాలను జైలు సూపరింటెండెంట్‌ సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి పంపించగా... అప్పటికే రఘురామ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి వెళ్లిపోయారు. దీంతో రిలీజ్‌ పత్రాలను ఆస్పత్రి వర్గాలు తిరిగి గుంటూరు జిల్లా జైలుకు పంపాయి.‘రిలీజ్‌ ఆర్డర్‌’పై సంతకం చేయకపోతే ఆయన సాంకేతికంగా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నట్లే అని సీఐడీ కోర్టు భావించింది. దీంతో ఆయన రిమాండ్‌ను ఈనెల 25 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సీఐడీ పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. రఘురామ నిబంధనల ప్రకారం రిలీజ్‌ ఆర్డర్‌పై సంతకాలు పెట్టకుండానే వెళ్లిపోయారని.. సాంకేతికంగా చూస్తే ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నట్లే లెక్కని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా జైలు సూపరింటెండెంట్‌ హంసపాల్‌ తాజాగా గుంటూరు అర్బన్‌ ఎస్పీకి లేఖ రాశారు. రఘురామ పరారీలో ఉన్నారని, ఆయన్ని ఎలాగైనా గుంటూరుకు తీసుకొచ్చి రిలీజ్‌ ఆర్డర్‌పై సంతకాలు చేయించాలన్నది లేఖ సారాంశంగా తెలుస్తోంది. ఈ వ్యవహారం అటు పోలీసు, ఇటు న్యాయ విభాగాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ వ్యవహారంపై రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదుల వాదన మరోలా ఉంది. ఎంపీ రఘురామరాజు బెయిల్‌, విడుదల విషయంలో తాము పూర్తిగా చట్టప్రకారం నడుచుకున్నామని ఆయన తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. బెయిల్‌ మంజూరు సమయంలో ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా రూ.లక్ష చొప్పున ష్యూరిటీలను సీఐడీ కోర్టులో సమర్పించామని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం రఘురామకు బెయిల్‌ మంజూరైన తర్వాత ఆయన చికిత్స పొందుతున్న ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కావచ్చని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు. సీఐడీ కోర్టు ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలిచ్చినట్టు తమకు తెలిసిందని, దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన స్పష్టం చేశారు.

Related Posts