న్యూఢిల్లీ జూన్ 18
దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది ఫ్రంట్లైన్ వర్కర్లను తయారు చేయాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్కిల్ ఇండియాలో భాగంగా కోవిడ్19 ఫ్రంట్లైన్ వర్కర్ల కోసం క్రాష్ కోర్సు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 45 ఏళ్లు దాటిన వారికి ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారో.. జూన్ 21వ తేదీ నుంచి 45 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో అదే రీతిలో గుర్తింపు ఉంటుందన్నారు. కోవిడ్19 క్రాష్ కోర్సు మూడు నెలల పాటు ఉంటుందని, శిక్షణ పొందిన వారు కోవిడ్ పోరాటంలో అందుబాటులో ఉంటారని ప్రధాని అన్నారు. నర్సింగ్, హోమ్కేర్, క్రిటికల్ కేర్, శ్యాంపిల్ కలెక్షన్, మెడికల్ టెక్నీషియన్ లాంటి అంశాలపై క్రాష్ కోర్సులో ఫోకస్ చేస్తారని ప్రధాని వెల్లడించారు. 26 రాష్ట్రాల్లోని 111 సెంటర్లలో శిక్షణ ఇవ్వనున్నారు.గడిచిన ఏడేళ్లలో వైద్య విద్య, కొత్త ఎయిమ్స్ బిల్డింగ్ల నిర్మాణం, వైద్య కళాశాలలు, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. వీటిల్లో చాలా వరకు ప్రారంభం అయినట్లు ఆయన చెప్పారు. గ్రామాల్లో పనిచేస్తున్న ఆశా, ఏఎన్ఎమ్, అంగన్వాడీ, హెల్త్కేర్ వర్కర్లను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. కోవిడ్ 19 పోరాటం వాళ్లు కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆయన చెప్పారు.