న్యూఢిల్లీ జూన్ 18
రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య 2024 నాటికి 50 శాతం వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అలాగే రోడ్ల నాణ్యతను మెరుగుపరిచేందుకు సైతం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సుమారు 50 శాతం రోడ్డు ప్రమాదాలు రోడ్ ఇంజినీరింగ్ సమస్యలతో జరుగుతున్నాయన్నారు. పరిశ్రమల సంస్థ ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కేంద్రమంత్రి ప్రసంగించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి సంవత్సరం సుమారు 1.5లక్షల మంది మరణిస్తున్నారన్నారు.2024కు ముందు మరణాలు, ప్రమాదాలను 50శాతం తగ్గిస్తామని, ఇదే నా అంతర్గత లక్ష్యమన్నారు. దేశంలో 22లక్షల మంది డ్రైవర్ల కొరత ఉందని గడ్కరీ పేర్కొన్నారు. దీంతో రెండువేల డ్రైవింగ్ పాఠశాలలను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో వెనుకబడిన జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తామన్న కేంద్రమంతి.. రహదారి భద్రత ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించారు. రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ మెరుగైన వ్యవస్థను నిర్మిస్తోందని తెలిపారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి నేతృత్వంలో స్వతంత్ర రోడ్ సేఫ్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసే ప్రణాళిక సైతం ఉన్నట్లు వివరించారు.