జగిత్యాల జూన్ 19
బీజేపీలో మాజీమంత్రి ఈటల రాజేందర్ చేరిక ఆ పార్టీ హుజూరాబాద్ నేతల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అయితే బీజేపీ ఆశలపై ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి నీళ్లు చల్లుతున్నారు. ఈటల, బీజేపీలో చేరడాన్ని పెద్దిరెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం ఆయన మెత్త పర్చేందుకు ప్రయత్నాలు చేస్తునప్పటికీ ఆయన తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. హుజూరాబాద్లో బీజేపీ పదాధికారుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రాకుండా పెద్దిరెడ్డి అలకపూనారు. హుజూరాబాద్లోనే ఉన్నా.. సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇప్పటి దాకా పెద్దిరెడ్డి ఈటలనూ కలవలేదు. దీంతో అయోమయంలో అనుచరులున్నారు. గతంలో ఈటల బీజేపీలో చేరడాన్ని పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈటల బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని హెచ్చరించారు కూడా. తనను సంప్రదించకుండా ఈటలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు.ఈటల బీజేపీలో చేరికను పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. ఆయన ఈ విషయంలో తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తన మద్దతుదారులతో మాట్లాడి తాను పోటీచేసే విషయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. దీంతో ఆయన టీఆర్ఎస్లో చేరి ఈటలపై పోటీకి దిగుతారని ప్రచారం ప్రారంభమైంది. ఆయన రెండు రోజులు క్రితం, రెండు రోజులపాటు ఇక్కడే పర్యటించి పలువురు మద్దతుదారులను కలిశారు. పెద్దిరెడ్డి కూడా టీఆర్ఎస్ పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.