హైదరాబాద్
ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రైవేట్ కళాశాలల పై చర్యలు తీసుకోలేని స్థితిలో టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని బీజేపీ యువమోర్చా నేతలు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం లోని ప్రయివేటు కళాశాలలో ఫీజుల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్నారని , ముందస్తు ప్రణాళికలలో భాగంగానే దోపిడీలకు తెరలేపారని ఆరోపించారు. ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద లక్షలలో దండుకుని, మళ్ళీ థర్డ్ వేవ్ అంటూ కళాశాలలు , విద్యా సంస్థలు మొత్తం మూసివేస్తారని అన్నారు. విద్యార్థులతో చెలగాటం ఆడుతున్నారని నిరసిస్తూ , ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 46 ప్రకారం ఫీజులను వసూలు చేయాలి. ఫీజుల పేరుతో ప్రయివేటు విద్యాసంస్థలు అవలంబిస్తున్న ధోరణిని వ్యతిరేకిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో కొత్తపేట లోని గాయత్రీ కళాశాల ముందు బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రైవేట్ కళాశాలలు ఫీజుల పేరుతో తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రభుత్వం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని బీజేవైఎం నాయకులు హెచ్చరించారు.