జలం జీవం కార్యక్రమంలో 200 ఇంకుడు గుంతలు తీయనున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. వర్షాకాలంలో రోడ్లపై నిల్వ ఉండే నీటి సమస్యను తొలిగించడానికి కొత్తరకం ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇంజెక్షన్ బోర్వెల్ విధానంలో రంధ్రాలున్న పీవీసీ కేసింగ్తో కూడిన ఆరించుల గొట్టాన్ని 150 అడుగులలోతు భూమి వరకు డ్రిల్ చేసి దాని చుట్టూ వర్షపు నీటి ఇంకుడు గుంతలను నిర్మిస్తారు. 14 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు ఉన్న ఇంకుడు గుంతలను 14 అడుగుల లోతు వరకు నిర్మిస్తారు. దానిలో 75 మిల్లీ మీటర్ల , 40 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్న గ్రానైట్ రాళ్లను తగిన మందంలో పేర్చుతారు. రాళ్లపై ఇసుకను చల్లి ఈ నిర్మాణాన్ని కనీసం ఒక 5 వేల లీటర్ల ట్యాంకర్ నీరు నిల్వ ఉండే ఖాళినీ విడిచిపెట్టి, పైన పటిష్టమైన రంధ్రాలున్న ఆర్సీసీ స్లాబ్ను రోడ్డు లెవెల్లో కప్పుతారు. మెట్రోరైలు కారిడార్లలో వర్షపు నీరు నిల్వ ఉండే రోడ్లను , ఇతర ప్రదేశాలను గుర్తించి వంద ప్రాంతాలలో ఇంజెక్షన్ బోర్వెల్స్తో కూడిన ఇంకుడు గుంతలను, ఇంజెక్షన్ బోర్వెల్స్ లేనటువంటి దాదాపు 200 వర్షపు నీటి ఇంకుడు గుంతలను నిర్మించనున్నరు..తగినంత బలం ఉన్న ఈ ఆర్సీసీ స్లాబ్పైన బరువైన వాహనాలు కూడా ప్రయాణించే అవకాశముంటుంది.మెట్రో కారిడార్లలో ప్రస్తుతం సరిగా పనిచేయని వరద నీటి కాలువల పునర్నిర్మాణం, కొత్త వరద నీటి కాలువల నిర్మాణంతో పాటు ఈ వర్షపు నీటి ఇంకుడు గుంతలను కూడా పెద్ద ఎత్తున మియాపూర్, జేఎన్టీయూ, కూకట్పల్లి, పంజాగుట్ట, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, అమీర్పేట్, మధురానగర్, మలక్పేట్, దిల్సుఖ్నగర్, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్రోడ్డు, వంటి ప్రాంతాలలో మెట్రోరైలు నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే పూర్తయిన కొన్ని ఇంకుడు గుంతల నిర్మాణాలు కురిసిన వర్షాలలో చక్కగా పనిచేసి మొత్తం నీటిని గుంజుకున్నాయని తెలిపారు. ఒక్కో గుంత నిర్మాణానికి రూ.లక్షా యాభైవేలు ఖర్చవుతుందని తెలిపారు. హైదరాబాద్ మహానగర నీటి సరఫరా, నీటి పారుదల మండలి ఇచ్చిన సహాయ సహకారాలకు మెట్రోరైలు ఎండీ కృతజతలు తెలిపారు.