అదిలాబాద్, జూన్ 26,
మంచిర్యాల జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి అలా చెప్పారో లేదో ఇటు జిల్లాలో అధికార పార్టీ నేతలు యాక్టివ్ అయ్యారు. మెడికల్ కాలేజీని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ నేతల నుంచి డిమాండ్స్ జోరందుకున్నాయి. వీరికి ప్రాంతాల వారీగా విపక్ష పార్టీల నాయకులు జత కలుస్తున్నారు.బెల్లంపల్లిలో అధికార, విపక్షాలు కలిసి మెడికల్ కాలేజీ కోసం ఉద్యమం చేపట్టాలని నిర్ణయించాయట. ఏకంగా మెడికల్ కాలేజీ సాధన సమితి అని పేరు కూడా పెట్టేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ నియోజకవర్గంలోనే కాలేజీ పెట్టాలని.. ఇందుకు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారట. ఈ దిశగా కొన్ని వినతిపత్రాలు సిద్ధం చేసి సంబంధిత విభాగాలకు.. మంత్రులకు.. ప్రభుత్వంలోని పెద్దలకు పంపుతున్నారట స్థానిక నాయకులు. కొందరైతే ముఖ్యమంత్రికే వినతిపత్రం ఇచ్చామని.. బెల్లంపల్లికే మెడికల్ కాలేజీ వస్తుందని ప్రచారం మొదలుపెట్టేశారు.ఇది చూసిన.. చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లోని ప్రజలు సైతం స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారట. ఎమ్మెల్యేలు కనిపిస్తే అదే పనిగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సమాచారం. ప్రజల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా.. ఉద్యమాలు చేయడానికి వారు ఇష్టపడటం లేదట. మేం చేయాల్సిన ప్రయత్నాలు చేస్తాం. మెడికల్ కాలేజీ సాధిస్తాం అని అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారట. తమ ప్రాంతాలు ఎందుకు అనుకూలమో ప్రభుత్వ పెద్దల చెవిలో ఒక మాటగా వేసినట్టు సమాచారం.బెల్లంపల్లి అన్ని ప్రాంతాలకు సెంటర్గా ఉంటుందని చెబుతూ.. పక్క జిల్లాల ప్రజాప్రతినిధులు సైతం ఉద్యమాలకు శ్రుతి కలుపుతున్నారట. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా.. మెడికల్ కాలేజీ ఎక్కడ ఉండాలో ఇప్పటికే నిర్ణయం అయిపోయిందని.. సీఎం కేసీఆర్ ఆ ప్లేఎస్ను ఎప్పుడో డిసైడ్ చేసేశారని మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా.. జిల్లాలోని ప్రజాప్రతినిధుల మధ్య మెడికల్ కాలేజీ దూరం తెస్తోందని టాక్. అధికార పార్టీ నాయకులకు ఇది ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. కాలేజీ తీసుకొస్తే.. జనాల్లో హీరోలుగా మిగులుతామని.. మరోసారి ఎమ్మెల్యే పదవికి ఢోకా ఉండబోదని కొందరు భావిస్తుంటే.. సెంటిమెంట్గా మారిన ఈ అంశంలో వెనకపడితే అది రాజకీయంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారట ఇంకొందరు. మరి.. ఈ విషయంలో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.