శ్రీనగర్ జూన్ 26
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం అవివేకం, మూర్ఖత్వమని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ఆర్టికల్ 370 రాజకీయ ఎజెండాను నెరవేర్చడానికి బీజేపీకి 70 ఏండ్ల సమయం పట్టిందన్నారు. తమ పోరాటం ఇప్పుడే మొదలైందని, మోదీతో సమావేశాల ద్వారా ఆర్టికల్ 370 ని తిరిగి తీసుకొస్తామని చెప్పడం ప్రజలను మోసపుచ్చడమే అని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్కు చెందిన 14 మంది సీనియర్ నాయకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం జరిగిన ఒక రోజు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 తిరిగి వస్తుందని ఆశించడం అవివేకమే అని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. దానిని పునరుద్ధరించడానికి ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు లేవని ఆయన తెలిపారు. మూడు గంటలకు పైగా ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో ఏమీ మాట్లాడకుండా మిన్నకుండిన ఐదుగురిలో ఒమర్ అబ్దుల్లా ఒకరు. ఈయనతోపాటు నిర్మల్ సింగ్, తారాచంద్, గులాం-ఏ-మీర్, రవీందర్ రైనా కూడా ఈ సమావేశంలో ఏమీ మాట్లాడలేదు.“సమావేశంలో జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల గురించి, డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం గురించి, జమ్ముకశ్మీర్లో ఎన్నికైన ప్రభుత్వం, దానికి రాష్ట్ర హోదా ఇవ్వడం గురించి ప్రధాని స్వయంగా మాట్లాడారు” అని చెప్పారు. జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల తర్వాత ఈ సమావేశాన్ని నిర్వహించడంతో తానెంతో ఆసక్తితో ఉన్నానని, ఇది గత ఏడాది కరోనా ప్రారంభమైనప్పటి నుంచి అతిపెద్ద భౌతిక సమావేశం అని ఆయన అభిప్రాయపడ్డారు.