హైదరాబాద్
తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, హరితహారంపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం ప్రగతిభవన్ లో కలెక్టర్లు, అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. జులై 1 నుంచి అమలు చేసే పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై చర్చించారు. నిర్దేశించిన ఏ పనీ పెండింగ్లోఉండేందుకు వీల్లేదన్నారు. నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం బాగా సహకరిస్తోంది. పనులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయో సమీక్ష చేసుకోవాలని ఆదేశించారు. ఏడో విడత హరితహారం కార్యక్రమంలో అందుకోవాల్సిన లక్ష్యాలను నిర్దేశించారు. గ్రామాల్లో ఇంటింటికీ 6 మొక్కలు చొప్పున పంపిణీ చేయాలని తెలిపారు. ప్రజలను చైతన్యపరిచి శ్రమదానంలో పాల్గొనేలా చేయాలని సూచించారు. కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అపరిష్కృతంగా ఉన్న పనులపై అధికారులు పునఃసమీక్ష చేయాలని సూచించారు.