హైదరాబాద్ జూన్ 28
మాజీ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా ఆయన విగ్రహానికి గవర్నర్, సీఎం కేసీఆర్ ఘన నివాళులర్పించారు. అంతకు ముందు పీవీ మార్గ్ ను గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పీవీ కుటుంబ సభ్యులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులో 26 అడుగుల ఎత్తులో పీవీ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పీవీ మార్గ్లోని జ్ఞానభూమిలో శతజయంతి ముగింపు ఉత్సవాలు జరగనున్నాయి.
పీవీ ఘాట్ కు వెళ్ళకుండా మాజీ మంత్రి పొన్నాలను అడ్డుకున్న పోలీసులు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు పీవీ ఘాట్ వద్దకు వెళ్లి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యను పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. పొన్నాలకు అనుమతి లేదంటూ పోలీసులు పీవీ ఘాట్లోకి వెళ్లనివ్వలేదు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. తనను అడ్డుకోవడం ప్రభుత్వ దుశ్చర్య అని... పీవీతో పనిచేసిన చాలామంది ఆయనకు నివాళి అర్పించాలనుకుంటారని పేర్కొన్నారు. గతంలో ఎవరైనా పీవీ ఘాట్ను సందర్శించేవాళ్ళన్నారు.