రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు వీస్తున్నాయి. సోమవారం అత్యధికంగా మంచిర్యాల జిల్లాలో 44.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఒక్కరోజే ఆయా జిల్లాల్లో 11 మంది వడదెబ్బకు బలయ్యారు. ఖమ్మం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. మంచిర్యాలలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, నిర్మల్లో 44.4 డిగ్రీలు నమోదైంది. జిగిత్యాల, ఆదిలాబాద్, సిద్దిపేటల్లో 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం ఎండలతో మండిపోతున్నది. రెండురోజులుగా రికార్డు స్థాయిలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 11డిగ్రీలు అధికంగాను, రాత్రి ఉష్ణోగ్రతలు 10.4డిగ్రీల మేరకు అధికంగానూ నమోదవుతున్నాయి ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 5.30గంటల వరకు పగటి ఉష్ణోగ్రత (గరిష్ఠ)42 డిగ్రీలు, నిన్న ఉదయం 8గంటల వరకు రాత్రి ఉష్ణోగ్రత(కనిష్ఠం) 27.4డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా గాలిలో తేమశాతం తగ్గి వడగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వడగాలులతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. పగటిపూట రహదారులన్నీ జనసంచారం లేక బోసిపోతున్నాయి.