YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఫైర్ బ్రాండ్ లు సైలెన్స్

ఫైర్ బ్రాండ్ లు సైలెన్స్

అనంతపురం, జూన్ 29, 
రాజ‌కీయ పార్టీకి అయినా.. ఫైర్ బ్రాండ్లు అవ‌స‌రం. ప్రత్యర్థి పార్టీలు, నేత‌ల నుంచి వ‌చ్చే విమ‌ర్శల‌కు చెక్ పెట్టేందుకు కొంద‌రు నేత‌లను అన్ని పార్టీలూ వాడుకుంటుంటాయి. ఆ పార్టీ ఈ పార్టీ అనేతేడా లేకుండా ఫైర్ బ్రాండ్లకు అన్ని పార్టీలూ ప్రాధాన్యం ఇస్తుంటాయి. వీరిని ప్రోత్సహిస్తుంటాయి కూడా. ఇలా… టీడీపీ అధినేత చంద్రబాబు చాలా మంది ఫైర్ బ్రాండ్లను ప్రోత్స‌హించారు. వీరిలో బుద్దా వెంక‌న్న, బీటెక్ ర‌వి, పోతుల సునీత (ఈమె పార్టీ మారారు), వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ స‌హా అనేక మంది నేత‌ల‌ను ప్రోత్సహించారు. వీరిలో గెలుస్తారు.. అనుకున్నవారికి ఎమ్మెల్యేలుగా అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, గెల‌వ‌ని వారిని ప‌క్కన పెట్టకుండా.. మండ‌లికి పంపారు. ఇదంతా కూడా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పడు చేసిందే. ఇది చంద్రబాబుకు గ‌త రెండేళ్లపాటు క‌లిసి వ‌చ్చింది. మండ‌లిలో అడుగు పెట్టిన టీడీపీ ఫైర్ బ్రాండ్లు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. మూడు రాజ‌ధానుల నిర్ణయం.. సీఆర్డీయే ర‌ద్దు నిర్ణయం.. స‌హా.. జ‌గ‌న్ తీసుకున్న రంగుల నిర్ణయం వంటివాటిపై మండ‌లిలో తీవ్రస్థాయిలో వాయిస్ వినిపించారు. దీంతో అటు అసెంబ్లీలో టీడీపీకి వాయిస్ లేక‌పోయినా మండ‌లిలో అయినా.. పార్టీ బ‌తికింద‌నే టాక్ వినిపించింది. చివ‌ర‌కు ఇది 151 మంది ఎమ్మెల్యేల‌తో అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ అధినేత జ‌గ‌న్‌కే తీవ్ర అస‌హ‌నం తెప్పించింది. తాను ఇంత భారీ మెజార్టీతో ముఖ్యమంత్రిని అయితే ఈ గంద‌ర‌గోళం ఏంట‌ని ఆయ‌న తీవ్ర ఆగ్రహంతో మండ‌లినే ర‌ద్దు చేయాల‌న్న సంచ‌ల‌న నిర్ణయం తీసుకునే వ‌ర‌కు వెళ్లింది.అయితే..ఇప్పుడు చాలా మంది టీడీపీ ఎమ్మెల్సీలు రిటైర‌య్యారు. మండ‌లి నుంచి కీల‌క‌మైన ఫైర్ బ్రాండ్లుగా ఉన్న బుద్దా వెంకన్న, బీటెక్ ర‌వి, వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌.. స‌హా ప‌లువురు రిటైర్ అయిపోయారు. దీంతో మండ‌లిలో టీడీపీ త‌ర‌ఫున గ‌ట్టివాయిస్ వినిపించేవారి సంఖ్య చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింది. బ‌య‌ట ఎంత వాయిస్ వినిపించినా.. శాస‌నస‌భ‌, మండ‌లిలో గ‌ట్టి వాయిస్ వినిపిస్తూ.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే నేత‌లు.. టీడీపీ ఇప్పుడు చాలా అవ‌స‌రం.శాస‌న‌స‌భ‌లో ఉన్నదే 23 మంది.. అందులోనూ న‌లుగురు పార్టీ వీడారు. ఇక ఉన్న 19 మందిలో ఆరేడుగురు ఎమ్మెల్యేలు అస‌లు నోరు విప్పరు. ఇలాంటి ప‌రిస్థితుల్లో త‌మ బ‌ల‌మైన వాయిస్ వినిపించే అవ‌కాశం ఉన్న మండలిలోనూ ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా టీడీపీకి సంఖ్యాబ‌లం త‌గ్గుతుండ‌డంతో పార్టీలో ఒక‌విధ‌మైన నైరాశ్యం క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం

Related Posts