YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాజ్యసభ రేసులో ఎవరు...

రాజ్యసభ రేసులో ఎవరు...

విజయవాడ, జూన్ 30, 
మ‌రో రెండు మాసాల్లో ఏపీలో రాజ్యస‌భ ఎంపిక ప‌ర్వం జ‌ర‌గ‌నుంది. రెండు నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇవ‌న్నీ కూడా వైసీపీకే ద‌క్కనున్నాయి. ఈ క్రమంలో వైసీపీలో కీల‌క నేత ఒక‌రు ఖ‌చ్చితంగా రాజ్యస‌భ‌కు వెళ్తార‌నే ప్రచారం జోరుగా సాగుతోంది. అది కూడా పార్టీలో కీల‌కంగా ఉన్న నేతే కావ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల టీటీడీ బోర్డును ప్రభుత్వం ర‌ద్దు చేసింది. దీంతో అప్పటి వ‌ర‌కు చైర్మ‌న్గా ఉన్న వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎంపీ.. సీఎం జ‌గ‌న్‌కు చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు ఖాళీ అయ్యారు. అయితే ఆయ‌న ప‌ద‌వి పొడిగించే అవ‌కాశాలు లేవు.నిజానికి బోర్డు చైర్మన్‌గా ఉన్నప్పటికీ..వైవీ సుబ్బారెడ్డి మ‌న‌సంతా ప్రత్యక్ష రాజ‌కీయాల‌పైనే ఉంది. రాజ‌కీయంగా ఆయ‌నే చాలా వ‌ర‌కు చ‌క్రం తిప్పుతున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లాలోను, గుంటూరు, ప్రకాశం జిల్లాలోనూ, ఇటీవ‌ల కాలంలో చిత్తూరు రాజ‌కీయాల్లో వైవీ సుబ్బారెడ్డి పాత్ర వినిపిస్తోంది. కొన్ని రోజుల కింద‌ట జ‌రిగిన తిరుప‌తి పార్లమెంటు ఉప ఎన్నిక‌లో మంత్రి పెద్దిరెడ్డితో స‌మానంగా వైవీ చ‌క్రం తిప్పారు. అభ్యర్థి త‌ర‌ఫున ప్రచారం చేయ‌డంతోపాటు.. నిధులు కూడా స‌మీక‌రించే బాధ్యత‌ను భుజాన వేసుకున్నారు. అంటే.. ఒక‌ర‌కంగా.. ఆయ‌న‌కు కూడా టీటీడీ చైర్మన్‌గా ఉండడం బ‌ల‌వంతంగానే భావించార‌నే వాద‌న వినిపించింది.ఇక‌, ఈ క్రమంలోనే చైర్మన్‌గా ఆయన ప‌ద‌వి కోల్పోయినా.. ఎక్కడా బాధ‌ప‌డ‌లేదు. మ‌రోసారి బోర్డును పొడిగించండి.. అని కోర‌లేదు. దీనికి కార‌ణం.. ఆయ‌న ప్రత్యక్ష రాజ‌కీయాల్లో మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తుండ‌డ‌మే. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నిక‌లు లేవు. పైగా.. వైవీ సుబ్బారెడ్డి అవ‌స‌రం ఇప్పుడు ఢిల్లీలో ఉంద‌ని.. ఎంపీల‌ను న‌డిపించే బాధ్యత విష‌యంలో సాయిరెడ్డిక‌న్నా..వైవీ సుబ్బారెడ్డి బెట‌ర్ అని.. కొన్నాళ్లుగా వైసీపీలోని ఓ వ‌ర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ మాట‌కు వ‌స్తే సాయిరెడ్డి ఎంపీ కాక‌ముందు ఢిల్లీలో వైసీపీ వ్యవ‌హారాలు వైవీ సుబ్బారెడ్డి , మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డే చక్క‌పెట్టేవారు.సాయిరెడ్డి క‌న్నా వ్యూహాలు వేయ‌డంలోను.. చాప‌కింద నీరులా ప‌ని చేయ‌డంలోనూ వైవీ సుబ్బారెడ్డి స‌రైనోడ‌నే పేరు కూడా వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో వైవీని రాజ్యస‌భ‌కు పంపాల‌ని వైసీపీలోని కొంద‌రు బ‌ల‌మైన నేత‌లు ( ముఖ్యంగా కొంద‌రు స‌ల‌హాదారులు) ఆలోచిస్తున్నార‌ని తెలుస్తోంది. దీనివ‌ల్ల కేంద్రంలో ఒక వ్యూహాత్మక ధోర‌ణితో అడుగులు వేసేందుకు కీల‌క నేత ల‌భించిన‌ట్టు కావ‌డంతోపాటు.. రాష్ట్రంలోనూ.. మంచి సంకేతాలు ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని వారు భావిస్తున్నార‌ట‌. ఇక్కడ వైవీ సుబ్బారెడ్డి రాజ్యస‌భ కావాల‌ని ప‌ట్టుబ‌ట్టే నేత‌ల అసలు ప్లాన్ వేరే.. అదే సాయిరెడ్డి హ‌వాకు బ్రేకులు వేయ‌డం.. అయితే వీరు ఈ విష‌యాన్ని జ‌గ‌న్‌కు చెప్పి ఒప్పించ‌డంలో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతార‌న్నది చూడాలి.

Related Posts