హైదరాబాద్, జూన్ 30,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కేబినెట్ కోసం కసరత్తు చేస్తున్నారు. 2023 ఎన్నికలకు సంబంధించి తన మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. త్వరలోనే కేసీఆర్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశముంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. ఈ రెండేళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలగాలి. అందుకే కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లాల పర్యటన చేపట్టారు.దీనికి తోడు చాలా రోజుల నుంచి మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల నుంచి మంత్రివర్గాన్ని విస్తరించలేదు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఎన్నికల సమయంలో సమర్థులయిన వారికి మంత్రి పదవిని ఇవ్వాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నారు. ఇందుకోసం ఆయన ప్రాంతాలు, సామాజిక కోణంలో కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది.ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేశారు. ఆ శాఖ సీఎం కేసీఆర్ చూస్తున్నారు. పెద్ద శాఖ కావడంతో దీనికి మంత్రిని నియమించాల్సిన అవసరం ఉంది. అలాగే కొందరు మంత్రుల పనితీరు బాగా లేదని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. వారికి రెండేళ్లకు పైగానే సమయం ఇచ్చారు. అయినా పనితీరు మెరుగు పర్చకపోవడం, కొందరు మంత్రులపై ఆరోపణలు రావడంతో వారిని తప్పించి కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే అవకాశముంది.మంత్రి వర్గ విస్తరణను కేసీఆర్ శ్రావణమాసంలో చేయనున్నారని తెలిసింది. ఆగస్టులో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పుడున్న వారిలో దాదాపు ఏడు నుంచి తొమ్మిది మందిని తప్పించి కొత్తవారికి కేసీఆర్ అవకాశమిస్తారని చెబుతున్నారు. ఎమ్మెల్సీల నుంచి కూడా ఒకరిద్దరు కేబినెట్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తం మీద ఆగస్టులో కేసీఆర్ తన మంత్రి వర్గ విస్తరణ చేపడాతారని తెలియడంతో ఆశావహులు ఎదురు చూస్తున్నారు