హైదరాబాద్ జూన్ 30
సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే ఎన్ఐసీ, టీఎస్ వెరిఫికేషన్ పూర్తయి జిల్లాల వారీగా జరుగుతున్న ధ్రువీకరణ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతున్నది. ఇదే అంశంపై రాష్ట్ర బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,15,901 అప్లికేషన్ల విచారణ తుదిదశకు చేరుకుందని మంత్రి తెలిపారు. త్వరలోనే లబ్ధిదారులను గుర్తించి వీలైనంత త్వరగా వారికి కార్డులతో పాటు రేషన్ ఒకేసారి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు. పదిహేను రోజులుగా జిల్లా స్థాయిలో రెవెన్యూతో పాటు ఇతర సిబ్బంది, జిహెచ్ఎంసీతో పాటు ఇతర సిబ్బంది నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. అర్హులను గుర్తించడం కోసం జిల్లా కలెక్టర్లు, డీఎస్వోలు, పౌరసరఫరాల శాఖ సిబ్బంది పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నారు. నూతన కార్డుల జారీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఎంత భారం పడినా సిద్ధంగా ఉన్నాం. సీఎం కేసీఆర్ ప్రతి పేదవాడి ఆకలిని తీర్చడానికి నిరంతరం కృషి చేస్తారన్నారని మంత్రి ప్రశంసించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.