YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్ఆర్ ఐ ఆస్పత్రి పై గద్దలు

ఎన్ఆర్ ఐ ఆస్పత్రి పై గద్దలు

గుంటూరు, జూలై 2, 
రాజధాని ప్రాంతంలోని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిపై గద్దలు వాలాయి. ఆస్పత్రిని అమ్మాల్సిందేనని, లేకపోతే భూమ్మీద నూకలు చెల్లిపోతాయని బెదిరించేంత తీవ్ర పరిస్థితులేర్పడడం గమనార్హం. మొత్తం డైరెక్టర్లలో 14 మంది అమ్మకానికి అంగీకరించినా, 16 మంది వ్యతిరేకంగా ఉన్నారని సమాచారం. దీంతో వారిపై కేసుల పరంపర మొదలైందని బలమైన ఆరోపణలొస్తున్నాయి. వివాదాల పేరిట, జరిమానాలు విధించి వారిని తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో వారు భయాందోళనలకు గురవుతున్నారు. దీనివెనుక పెద్దలు ఉండటంతో జరిగిందంతా నిర్భయంగా చెప్పడానికి ఎవరూ ధైర్యంగా ముందుకు రావడం లేదు. ఒకవైపు రాజధాని ఇక్కడ ఉండదన్న ప్రచారం సాగుతుండగానే మరోవైపు కీలకమైన ఆస్తులు, సంస్థల కొనుగోలుకు సంబంధించిన చిత్ర విచిత్ర వ్యవహారాలు జరుగుతుండడం ఆశ్చర్యకరం. 23 ఎకరాల విస్తీర్ణంలో భవనాలు, 750 పడకలు గల మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిని అమ్ముతున్నారంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిని తమకు అమ్మాలని రెండు నెలల క్రితం కొంతమంది అధికార పార్టీ నేతలు ఆస్పత్రి బోర్డును సంప్రదించారు. బోర్డులో 14 మంది అమ్మేందుకు సిద్ధపడగా 16 మంది వ్యతిరేకించారు. కొనుగోలు చేయాలనుకున్నది పెద్దలు కావడంతో కాదంటున్నవారిపై మంగళగిరి పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. వేధింపుల పర్వం మొదలైంది. గొడవను సర్దుబాటు చేసి బేరసారాలు జరిపేందుకు తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న ఓ కాంట్రాక్టు కంపెనీ యాజమాన్యం జోక్యం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆ కంపెనీయే స్వాధీనం చేసుకుంటుందనే వార్తలు వచ్చాయి. అమ్మకం ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పర్యవసానాలుంటాయని బెదిరిస్తున్నారని కొంతమంది వాటాదారులు ఇటీవల విలేకరుల సమావేశంలో తెలిపారు. దీనివెనుక కొంతమంది ప్రభుత్వ పెద్దలున్నారని, వారి మాట వినడం లేదనే ఉద్దేశంతోనే తమపై కక్షసాధింపులకు దిగుతున్నారని, జరిమానాలు, కేసులు అన్నీ ఆస్పత్రి అమ్మకాన్ని వ్యతిరేకించిన వారిపైనేనని వివరించారు. తమకు ప్రాణహాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని తెలిపారు.విజయవాడ, గుంటూరు మధ్యలో విశాల వాతావరణంలో ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కళాశాల, అనుబంధంగా ఆస్పత్రి ఉంది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో(సుమారు 23 ఎకరాలు) నిర్మాణాలు, 750 బెడ్లు ఉన్నాయి. అన్ని రకాల వైద్య పరీక్షలకు అవసరమైన ల్యాబరేటరీలు ఏర్పాటు చేశారు. అన్ని సదుపాయాలూ ఉండటంతోపాటు విలువ కూడా ఎక్కువ కావడంతో కొనుగోలు చేసేందుకు కొంతమంది పెద్దలు సిద్ధపడ్డట్లు తెలిసింది. ఎంబిబిఎస్‌, పిజి, సూపర్‌స్పెషాలిటీ కోర్సులతోపాటు పారామెడికల్‌ కోర్సులూ ఉన్నాయి. మొత్తం 200 మెడికల్‌ సీట్లు ఉండగా వీటిల్లో ఎ కేటగిరీలో 100, బి కేటగిరీలో 70, సి కేటగిరీలో 30 సీట్లు ఉన్నాయి. ఎంబిబిఎస్‌ సీటు రూ.36 లక్షలు, పిజి సీటు రూ.80 లక్షల వరకూ పలుకుతుంది. ఇలాంటి కారణాలవల్ల ఈ బోధనాసుపత్రికి డిమాండు ఏర్పడింది.

Related Posts