YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీకి కేంద్రం షాక్

ఏపీకి కేంద్రం షాక్

న్యూఢిల్లీ, జూలై 2,
అప్పుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం దిమ్మతిరిగే షాకిచ్చింది. రుణ పరిమితిని పెంచాలని కోరుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు కేంద్రం చుట్టూ చక్కర్లు కొడుతున్న తరుణంలోనే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌ రుణ పరిమితిని రూ.27,668 కోట్లకే పరిమితం చేస్తూ తాఖీదు పంపింది. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.42,472 కోట్ల బహిరంగ మార్కెట్టు రుణంగా తొలుత లెక్కతేల్చినా తాజాగా అందులో కేంద్ర ఆర్థికశాఖ అధికారులు భారీ కోత పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్టు రుణ పరిమితిని రూ.27,668 కోట్లుగా నిర్ధారించిన విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రావత్‌కు కేంద్ర ఆర్థికశాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సుమిత్‌ అగర్వాల్‌ లేఖ పంపారు. రాష్ట్రం నికర రుణ పరిమితి లెక్కలు తేల్చేందుకు గత కొన్నేళ్లుగా తీసుకున్న రుణాలపై సమగ్ర నివేదిక పంపాలని ఈ ఏడాది మార్చిలోనే ఏపీ అధికారులను కేంద్రం కోరింది. ఆ వివరాలన్నీ సమర్పించిన తర్వాత పరిమితి ఎంత ఉందో చెబుతామని స్పష్టం చేసింది.ఏప్రిల్‌లో ఆర్థికశాఖ అధికారులు ఆ వివరాలన్నీ కేంద్ర ఆర్థికశాఖకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం విభజన తర్వాత ఇంతవరకు చేసిన అప్పుల వివరాలన్నీ ఏప్రిల్‌ 22న లేఖ రూపంలో కేంద్రానికి తెలియజేసింది. రాష్ట్రానికి ఉన్న రుణ పరిమితి కన్నా ఇంతకుముందు సంవత్సరాల్లోనే అదనంగా రూ.17,923.94 కోట్లు అప్పు చేసినట్లు కేంద్రం గుర్తించింది. దీంతోపాటు ఇతరత్రా అప్పుల రూపంలోనూ రూ.6,000 కోట్లు మినహాయించింది. అన్నీ కలిపి ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రుణ పరిమితికి రూ.23,924 కోట్ల కోత పడి... చివరకు రూ.27,668 కోట్లకు చేరింది.పెట్టుబడి వ్యయం కోసం మొత్తాన్ని ఖర్చు చేశాక మరో 0.5% మేర రుణ పరిమితి పెంచుతామని షరతు విధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ స్థూల జాతీయోత్పత్తి రూ.10,61,802 కోట్లుగా ఆర్థిక సంఘం లెక్కలు వేసింది. అందులో 4% మేర ఈ ఏడాది రాష్ట్రం అప్పులు చేసుకునేందుకు వీలుంటుందని తేల్చింది. ఆ లెక్కన రూ.42,472 కోట్లు రాష్ట్రం అప్పు తీసుకోవచ్చని లెక్కలు కట్టి ఇందులో మూలధన వ్యయం కింద రూ.27,589 కోట్లు ఖర్చు చేయాలని సూచించింది. తాఖీదు అందడంతో రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కేంద్రానికి వివరణలు పంపి కొంతమేర అదనపు రుణ పరిమితి రాబట్టేందుకు ఉన్న మార్గాలపై సమాలోచనలు జరుపుతున్నారు.

Related Posts