YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నీళ్లు... నియామాకాలే రేవంత్ అస్త్రాలు

నీళ్లు... నియామాకాలే  రేవంత్ అస్త్రాలు

హైదరాబాద్, జూలై 5, 
దేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. ఎందరో సీనియర్లను కాదని తనకు పగ్గాలు ఇచ్చిన కాంగ్రెసుకు బలం చేకూర్చాల్సిన బాధ్యత అతనిపై ఉంది. రాష్ట్రం ఇచ్చి కూడా నష్టపోయిన తెలంగాణలో హస్తానికి ఆధిక్యం సమకూర్చే వ్యూహ రచన చేస్తున్నారు. లీడర్ గా తన ఇమేజ్ పెంచుకోవడంతోపాటు ప్రజల్లో కాంగ్రెసు పట్ల క్రేజ్ పెంచాలనేది ఆలోచన. తాజాగా టీఆర్ఎస్ మరోమారు నీళ్ల తగాదాతో సెంటిమెంటు సెగ పెంచడానికి ప్రయత్నాలు చేస్తోంది. దానినే అస్త్రంగా మలచుకుంటూ కేసీఆర్ ను టార్గెట్ చేయాలని, టీఆర్ఎస్ ను బద్నాం చేయాలని పీసీసీ నేత కాంగ్రెసు అధిష్టానానికి నివేదిక పంపినట్లు తెలిసింది. ఏపీ, తెలంగాణ జల వనరుల వివాదం తో హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను గట్టెక్కించాలనేది కేసీఆర్ ఎత్తుగడ. ఈ అంశాన్ని కేవలం ఉప ఎన్నికతోనే ముడి పెట్టకుండా రాష్ట్రం మొత్తం కాంగ్రెసు హవా పెంచడానికి వాడుకోవాలనేది రేవంత్ రెడ్డి దూరాలోచన. ఆ దిశలో ఇప్పటికే యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.రేవంత్ రెడ్డి కి ఇప్పటికే తెలంగాణ మీడియా పెద్ద పీట వేయడం ప్రారంభించింది. ప్రజల్లోకి వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది. అసమ్మతి కారణంగా మళ్లీ కాంగ్రెసు బజారున పడుతుందని ప్రత్యర్థులు ఆశించారు. రేవంత్ అదృష్టమేమో తెలియదు. అసమ్మతి గప్పున చల్లారిపోయింది. దీంతో తన లక్ష్యం వైపు సింగిల్ పాయింట్ అజెండాతో పని మొదలుపెట్టేందుకు అవకాశం ఏర్పడింది. టీఆర్ఎస్ లేవనెత్తిన జలవివాదాన్ని కాంగ్రెసు అజెండాగా మార్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. కేవలం రాష్ట్రంలో కాకుండా పార్లమెంటు వేదికగా దీనిపై రచ్చ చేయాలని నిర్ణయించారు. తాను రాష్ట్రం హక్కుల కోసం టీఆర్ఎస్ కంటే ఎక్కువగా పోరాడతానని నిరూపించుకునేందుకు ఇదో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నారు. కాంగ్రెసు పార్టీకి రాష్ట్రంలో లీడర్ గానే కాకుండా కేసీఆర్ కు దీటైన నాయకుడిగా కూడా ప్రజల్లో నాటుకుపోవడానికి ఇదే చాన్పుగా రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. ఈనెల 28 న మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర అంశంపై గళమెత్తేందుకు అజెండా రెడీ చేస్తున్నారు.వైసీపీ, టీఆర్ఎస్ రెండు రాష్ట్రాల్లోనూ తమకు రాజకీయ ప్రయోజనం సమకూరే విధంగా తెలివైన రాజకీయం నడుపుతున్నాయి. దీనిని బద్దలు చేయాలంటే రెండు పార్టీలను పార్లమెంటులోనే నిలదీయాలనేది యోచన. పనిలో పనిగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని సైతం బరిలోకి లాగవచ్చు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రయోజనాలు, విభజన చట్టం పేరుతో ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంటులో రేవంత్ రెడ్డి అజెండాకు మద్దతు పలుకుతుంది. ఆ పార్టీకి ఏపీలో ఎలాగూ పొలిటికల్ స్టేక్స్ లేవు. సమీపభవిష్యత్తులో అక్కడ బలపడే అవకాశాలు కూడా లేవు. అందువల్ల తెలంగాణ రాష్ట్రాన్ని ఏకైక ప్రాతిపదిక చేసుకోవడానికి అభ్యంతరాలు లేవు. రెండు రాష్ట్రాల నీటి వివాదంపై లోక్ సభలో నోటీసు ఇచ్చి, చర్చకు పట్టుపడితే అది రేవంత్ రెడ్డి ఘనతే అవుతుంది. అవసరమైతే పోడియంలో గందరగోళం సృష్టించి సస్పెండ్ కావడానికి కూడా సిద్దమేనని రేవంత్ అనుచరులు పేర్కొంటున్నారు. అదే జరిగితే వైసీపీ, టీఆర్ఎస్ లు సైతం తమ పార్టీల ప్రయోజనాల కోసం లోక్ సభలో రంగంలోకి దిగక తప్పదు. ఈ రచ్చ ఎటు దారి తీస్తుందో తెలియదు. వైసీపీ, టీఆర్ఎస్ లు తప్పించుకోలేవు. పైపెచ్చు కేంద్రం ఇరకాటంలో పడుతుంది. ఆ క్రెడిట్ మాత్రం రేవంత్ ఖాతాలోనే పడుతుంది. కాంగ్రెసు పార్టీకి తెలంగాణలో ఇమేజ్ వస్తుంది.నిధులు, నీళ్లు, నియామకాలు అన్న సెంటిమెంటు తోనే తెలంగాణ ఆవిర్భవించింది. నిధుల సమస్య దానంతటదే సద్దుమణిగిపోయింది. నీళ్లు, నియామకాలు అంశం ఇంకా నలుగుతూనే ఉంది. నిరుద్యోగులు నిరంతరం పెరుగుతూనే ఉంటారు. అందరికీ ఉపాధి చూపించడం ప్రభుత్వం వల్ల కాదు. నీళ్ల అంశమూ తేలేది కాదు. పైపెచ్చు దక్షిణ తెలంగాణకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందనే వాదన ఉంది. కాళేశ్వరం వంటి బారీ ప్రాజెక్టులు ఉత్తర తెలంగాణలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వం , దక్షిణ తెలంగాణలో కాంగ్రెసు హయాం నుంచి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులనే పూర్తి చేయలేదు. పీసీసీ అధ్యక్షుడిగా నేరుగా ఉత్తర, దక్షిణ తెలంగాణలనే విభజన చేసి మాట్టాడటం రేవంత్ రెడ్డి కి రాజకీయంగా నష్టదాయకం. అందువల్ల జిల్లాల వారీగా అన్యాయం అంటూ ప్రత్యేక అజెండాతో దక్షిణ తెలంగాణకు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదనే అంశాన్ని హైలైట్ చేయాలని భావిస్తున్నారు. ఏ కత్తితో యుద్దం చేసేవాడు , ఆ కత్తికే బలవుతాడనే మొరటు సామెత ను రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్నారు. కేసీఆర్ తరచూ లేవనెత్తే నీళ్ల అంశమే ఆయనను రాజకీయంగా డిఫెన్స్ లో పడేసి టీఆర్ఎస్ పతనానికి కారణమవుతుందనేది కొత్త పీసీసీ నేత అంచనా.

Related Posts