హైదరాబాద్, జూలై 6,
హైదరాబాదులో ట్రాఫిక్ కష్టాలను తగ్గించే క్రమంలో ఏర్పాటు చేసిన బాలానగర్ ఫ్లైఓవర్ ను శివమ్మ అనే కార్మికురాలితో కలిసి ప్రారంభించడం ద్వారా మంత్రి కేటీఆర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కాగా ఈ నూతన ఫ్లైఓవర్ కు బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ అని నామకరణం చేశారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. గత 4 దశాబ్దాలుగా ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈ ప్రాంత వాసులకు తాజా ఫ్లైఓవర్ పెద్ద ఊరట అని చెప్పాలి.ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ, వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక ద్వారా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. ఒక్క కూకట్ పల్లి నియోజకవర్గ పరిధిలోనే రూ.1000 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు, రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్టు తెలిపారు. త్వరలోనే బాలానగర్ పరిధిలో రోడ్ల విస్తరణ కూడా జరగనుందని పేర్కొన్నారు.హైదరాబాద్లో ఎల్లప్పుడూ వాహనాల రద్దీ ఉండే ప్రాంతాల్లో బాలానగర్ ఒకటి. వాహనదారులు ఆ చౌరస్తా మీదుగా వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవారు. వారి ఇబ్బందులను తొలగించేందుకు నిర్మించిన ఫ్లైఓవర్ నేడు తెలంగాణ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్లో 6 లేన్లతో నిర్మించిన మొట్టమొదటి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఇదే.రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రణాళిక (ఎస్ఆర్డీపీ)లో భాగంగా హెచ్ఎండీఏ ఈ పైవంతెనను నిర్మించింది. ప్రస్తుతం నెలకొంటోన్న ట్రాఫిక్ సమస్యలతో పాటు రాబోయే 40 ఏళ్ల ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని దీన్ని నిర్మించారు. ఈ వంతెన నిర్మాణానికి 2017 ఆగస్టులో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
రూ.387 కోట్ల వ్యయంతో 1.13 కిలోమీటర్ల మేర ఈ వంతెన నిర్మించారు. వంతెనపై బీటీరోడ్డు వేయడంతో పాటు మధ్యలో డివైడర్, వాటిలో పూల మొక్కలు నాటారు. అలాగే, ఎల్ఈడీ వీధిలైట్లు అమర్చారు. ఈ వంతెన వల్ల సికింద్రాబాద్-కూకట్పల్లి-అమీర్పేట-జీడిమెట్ల వైపునకు వాహనాలు ఎలాంటి చిక్కులు లేకుండా వెళ్లే వెసులుబాటు కూడా కలుగుతుంది.