YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

హనుమాన్ చరితం

హనుమాన్ చరితం

ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం. ఎక్కడ హనుమ ఉంటారో అక్కడ శ్రీరామచంద్రులవారు తప్పక ఉంటారు. శ్రీరాముని పేరు వినగానే  మనకు ఆంజనేయస్వామి తప్పక గుర్తుకువస్తారు. హిందువులంతా హనుమంతుని ఆంజనేయుడనీ, మారుతి అనీ ఇంకా అనేక నామాలతో కొలిచి కీర్తిస్తుంటారు. రామాయణంలో రామునికున్నంత ప్రాముఖ్యం హనుమకూ ఉంది. హనుమాన్ అంజనాదేవి, కేసరిల సుతుడు. చైత్ర శుధ్ధపౌర్ణమినాడు, మూలానక్షత్రాన, మహారాష్ట్రలోని  త్రయంబకేశ్వరంలో జన్మించినట్లు ఒక కథనం. వేదాల కథ ఆధారంగా, అంజనాదేవి ఒక అప్సరస అనీ, శాపవశాన భూలోకంలో వానర వంశంలో జన్మించిందనీ, రుద్రదేవుడైన శివుని వరం వల్ల ఆమెకు పుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్తురాలు అవుతుందని చెప్పబడింది. అందువల్ల ఆమె భర్తతో కూడి శంకరుని అతిభక్తితో ధ్యానించి, ఆ రుద్రుని వరంతో, ఆయన అంశతో ఆంజనేయుని పుత్రునిగా పొందింది.  హనుమకు 28 మహిమలు లభించాయి, ఆకాశగమనం, శరీరాన్ని పెంచడం, కుంచించడం వంటివి.

మరొక చారిత్రక కధనం ప్రకారం - కర్ణాటకలోని, హంపీవద్ద గల 'గుంలవ్య తోట' అనే గ్రామానికి18 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలోని 'అంజని గుహ'లో, పంపానదీ తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది.

వాల్మీకి రామాయణంలోని యుధ్ధకాండలో కేసరి బృహస్పతి కుమారుడనీ, రామరావణ యుధ్ధసమయంలో ఆయన రాముని సేనలో చేరి యుధ్ధంచేసినట్లు ఉంది. అయోధ్యలో దశరధ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు, యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసాన్ని, మహారాజు ముగ్గురు రాణులకూ పంచగా, సుమిత్రభాగమున్నపాత్రను ఒక గ్రద్ద తన్నుకుని ఆకాశంలో వెళుతూ విడచి వేయడంతో అదివెళ్ళి శివుణ్ణి భక్తితో ప్రార్ధిస్తున్న అంజనాదేవి దోసిట్లోపడినట్లూ, ఆమె దాన్ని దైవప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా, ఆమెకు ఆంజనేయస్వామి జన్మించినట్లు రామాయణంలో ఉంది.  అందుకే శ్రీరాముడు హనుమంతుణ్ణి తన నాల్గవ సోదరునిగా ఆదరించారు.

ఆంజనేయుడు బాల్యంలో సూర్యుని పండుగా భావించి నోట కరుచుకోగా, దేవేంద్రుని వజ్రాయుధ ఘాతానికి చెంప ఉబ్బడంతో 'హనుమ' అనే నామం వచ్చినట్లు కూడా చెప్తారు. సూర్యుణ్ణి హనుమంతుడు తన గురువుగా భావించి సేవించి, ఆ సూర్యదేవుని నుండి సకల శాస్త్రజ్ఞానం పొంది, గురుదక్షిణగా సూర్య కుమారుడైన, సుగ్రీవుని సేవించడానికి అంగీకరిస్తాడు. ఇది ఆయన సత్య వాక్ దీక్షకూ, గురుభక్తికీ  తార్కాణం. మహిరావణుడు యుధ్ధసమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినపుడు, ఆoజనేయస్వామి వెళ్ళి, మహిరావణుడు వెలిగించిన ఐదు అఖండ దీపాలను ఆర్పవలసివచ్చి పంచముఖాలతో - అనగా వరాహ ముఖంతో ఉత్తర దిశన, నరసింహ ముఖంతో దక్షిణ దిశన, గరుడముఖంతో పడమర దిశన, హయగ్రీవముఖంతో ఆకాశంవైపు, తన హనుమ ముఖంతో తూర్పు దిశన ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేందుకు 'పంచముఖ ఆంజనేయుని'గా రూపుదాల్చారు. ఇది ఆయన స్వామి కార్య దీక్షకు నిదర్శనం.

యుధ్ధానంతరం హనుమంతుడు హిమాలయ పర్వతం మీద నివసిస్తూ 'హనుమద్రామాయణాన్ని’   తన గోళ్ళతో వ్రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి, ఆ రామాయణాన్నిచదివి, అసంతృప్తిని వ్యక్తపరచగా, హనుమంతుడు కారణం అడుగుతాడట! అప్పుడు వాల్మీకి మహర్షి 'ఈ రామాయణంలో హనుమ పాత్రను చిత్రించక పోవడం వల్ల అది అసంపూర్తిగా వుంది కాబట్టి తనకు అసంతృప్తికలిగించినదని' చెప్పారు. అప్పుడు హనుమంతుడు తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నారు ! ఎంత నిరాడంబరత !! అందుకే హనుమంతుడిని ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని, గర్వాహంకారాలు పోతాయనీ అంటారు. అందుకే అందరూ హనుమంతుణ్ణి పూజిస్తారు రామునితో సమానంగా ! అందుచేత భారతదేశంలోనే గాక ప్రపంచ దేశాలలో కూడా హనుమాన్ ఆలయాలు విరాజిల్లుతున్నాయి  .

హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఐన 'శిమ్లా' లోని 'జాఖూ' హనుమాన్ ఆలయం అత్యంత ప్రసిధ్ధి చెందినది. ఈ కొండపై యక్ష, కిన్నర గంధర్వ కింపురుషులు నివశించేవారనీ, హనుమ ఆకాశం పైకి ఎగరడానికి అనుకూలంగా ఆ కొండసగానికి భూమిలోకి దిగిపోయిందని, హనుమంతుడు కాలుపెట్టిన చోట ఆలయం వెలిసిందనీ చెప్తారు.

క్రీ.శ. 883 నాటికే ఖుజరహోలో అంజనేయస్వామి ఆలయం ఉన్నట్లు శిలాశాసనాల వలన తెలుస్తోంది. ’సంకటమోచన హనుమాన్ మందిరం’ పంజాబ్ లోని ’ఫిల్లూర్’లో ఉంది. తమిళనాడులోని ’నమ్మక్కళ్ 'లో ఉన్న ఆంజనేయ విగ్రహం ఎత్తు 18 అడుగులు. తూర్పుముఖంగా ఉన్న ఈ ఆంజనేయ విగ్రహం ఎదురుగా ఉన్నలక్ష్మీ నారాయణ స్వామికి నమస్కరిస్తున్న భంగిమలో ఉంటుంది.  ఈ విగ్రహం స్వయంభువు అయినందున నిరంతరం పెరుగుతూనే ఉన్నారనీ, అందువల్ల పైన కప్పువేయడానికి వీలుకాలేదని ఆలయ కథనం వలన తెలుస్తోంది.

వెల్లూరు జిల్లాలోని ఆర్కోణానికి 30 కిలోమీటర్ల దూరంలో ’యోగ నరసింహ' ఆలయానికి సమీపంలో 'యోగాంజనేయ' ఆలయం చిన్నకొండ మీద ఉంది. ఆలయాన్ని చేరుకోడానికి 480 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఆంజనేయమూర్తి చతుర్భుజాలతో, రెండు చేతులతో శంఖచక్రాలు, మరో రెండు హస్తాలతో జపమాల ధరించి ’యోగ నరసింహస్వామి’ ని వీక్షిస్తున్నట్లు ఉంటుంది .

’యోగ నరసింహస్వామి‘ యోగామృతవల్లి ఉండే ఆలయంలోకి వెళ్ళటానికి పెరియవై కొండ మీదకు1305 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. భక్తులు ఎంత శ్రధ్ధగా శ్రమపడి ప్రార్థిస్తారో దేవుని అనుగ్రహం అంత అధికంగా లభిస్తుందనేది భక్తులనమ్మకం.

కర్ణాటక రాష్ట్రం రాజధాని బెంగుళూరులోని జె.పి.నగర్లో వెలసి ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం ఒక గుట్టపై ఉంది. దీనిని మహామహిమాన్వితమైన ఆలయంగా భక్తులు సేవిస్తారు. మహారాష్ట్ర రాజధాని ముంబాయ్ లోని  ఎస్.ఐ.ఇ.ఎస్  కాంప్లెక్స్ లోని హనుమాన్ విగ్రహం ఎత్తు 33అడుగులు (10మీటర్లు) 12.అడుగుల ఎత్తైన ప్లాట్ ఫారం మీద ప్రతిష్టించబడి ఉంది. మొత్తం విగ్రహం ఎత్తు భూమినుండి 456అడుగులు(14.మీ)ఉంటుంది. వెండి కవచంతో ఈ మారుతీ విగ్రహం కప్పబడి ఉంది.

1989 లో చెన్నయ్ లోని నంగనల్లూర్ లో ఒకే రాతితో చెక్కబడిన 32అడుగుల(10.మీ)ఎత్తైన ఆంజనేయస్వామి విగ్రహం చెప్పుకోదగినది. ఒరిస్సాలోని రూర్కెలాలో హనుమాన్ వాటిక ఆలయ కాంప్లెక్స్ లో 72 అడుగుల హనుమాన్ విగ్రహం ఉంది.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నూరులో 30.అడుగుల అంజనేయస్వామి విగ్రహం భక్తులకు కొంగు బంగారంగా వెలసి ఉంది. అవధూతదత్త పీఠాధిపతి ’గణపతి సచ్చిదానందస్వామి‘ వారిచే 85.అడుగుల (26.మీ)ఎత్తైన ఆంజనేయస్వామివారి విగ్రహం ప్రతిష్ఠ చేయబడి ఉంది.

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం విజయవాడకు 27 కి మీ దూరంలో పరిటాలా అనే గ్రామంలో 135. అడుగుల ఎత్తైనఆంజనేయస్వామి విగ్రహం  2003 లో ప్రతిష్టింపబడింది. ఈ ఆంజనేయ విగ్రహం దుష్టగ్రహాలను దూరం చేసేదిగా ప్రసిధ్ధి పొందినది. ప్రతిష్ఠాసమయంలో సజీవంగా కదిలిందని చెప్తారు.

తమిళనాడులోని కన్యాకుమారికి సమిపంలో 8 అడుగుల ఎత్తైన మారుతీ విగ్రహం ఉంది. కేరళ తిరువళ్ళుర్ కు 5, 6 కి.మీ.దూరంలోఉన్న 'చిన్నకవియూర్ 'లోని శివాలయంలో వంద సంవత్సరాల క్రితం పంచ లోహాలతో నిర్మించబడిన హనుమాన్ విగ్రహం ఉంది. కుంభకోణంలో 40.అడుగుల ఎత్తైన (12.మీ) పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం గ్రానైట్ రాతితో మలచబడింది. తిరువళ్ళూర్లో పంచముఖ ఆంజనేయ విగ్రహం భక్తుల భయాలు దూరంచేసే అభయమూర్తిగా నిలచిఉంది.

హనుమాన్ ఒక్కడే శని ప్రభావం సోకని వానిగా చెప్తారు. రావణుని నుండి విముక్తి పొందిన శనిదేవుడు, హనుమాన్ పట్ల కృతజ్ఞతగా మారుతిని పూజించే వారికి తన దృష్టి  సోకదని వాగ్దానం చేశాడట!

కేరళ రాష్ట్రంలోని తిరువళ్ళూర్ వద్దగల, మల్లాపురం జిల్లాలో వశిష్ఠులవారిచే 3 వేల సంవత్సరాల క్రితం అంటే 1,000.బి.సిలో ప్రతిష్టింపబడిన హనుమాన్ మూర్తి అతిప్రాచీనమైనదిగా గుర్తింపబడి ఉంది. అలధియూర్ లోని హనుమాన్ ఆలయంలో ఒక పెద్ద వేదికపైనున్న ఒక గ్రానైట్ రాతిపై సముద్రచిత్రం చిత్రించి ఉండగా భక్తులు దూరం నుండీ పరుగుతీస్తూ వచ్చి హనుమాన్ సముద్రాన్ని లంఘించినదానికి చిహ్నంగా  ఈ రాతిపైనుండి దూకుతారు. దీని వల్ల ఆ భక్తుల బాధలు, కష్టాలు తీరిపోయి, ఆరోగ్యం, భాగ్యం, దీర్ఘాయువు కల్గి, అదృష్టం కలసి వస్తుందని విశ్వాసం. ఈ 'అలధియూ హనుమాన్' ఆలయదర్శనం భక్తుల మానసిక శారీరక రుగ్మతలు బాపడమేగాక వారి సర్వకోరికలూ ఈడేరుతాయనే సంపూర్ణ నమ్మకం ఉంది. అందువల్లే భక్తులు తప్పక జీవితంలో ఒక్క సారైనా ఈ 'అలధియూర్ హనుమంతుడి'ని దర్శించి తరిస్తారు.

అహమ్మదాబాద్ లోని కంటోన్మెంట్ ప్రాంతంలో ’షహీబాగ్' సమీపంలోని క్యాంప్ హనుమాన్ ఆలయం పండిట్ గజాననప్రసాద్ వంద సంవత్సరాల క్రితం కట్టించారు. భారత ప్రధానులైన, అటల్ బిహారీ వాజ్ పేయ్, ఇందిరాగాంధీ వంటి ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించినట్లు చెప్తారు.

రామ చరిత మానస్, హనుమాన్ చాలీసా వ్రాసిన తులసీదాస్ (1532-1623) ఢిల్లీలోని హనుమాన్ ఆలయాన్ని దర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఈ ఆలయంలో 24 గంటలూ 'శ్రీరామ జయ రామ జయజయ రామ' అనే మంత్రజపం1964 ఆగస్టు ఒకటవ తేదీ నుండి నిరాటంకంగా జరుగుతూ వుండటం విశేషం.

మాజీ అమెరికా అధ్యక్షుడైన 'బరాక్ ఒబామా' అధ్యక్షునిగా పోటీ చేస్తున్న సమయంలో, ఈ ఆలయమూర్తి అయిన హనుమంతుడి విగ్రహాన్ని ఆయన శ్రేయోభిలాషులు ఆయన విజయాన్ని కాంక్షించి ఆయనకు బహుమతిగా ఇచ్చినట్లు మనం వార్తాపత్రికల్లో చదివాం.15 కిలోల బరువైన, బంగారు పూతతో ఉన్న హనుమాన్ విగ్రహాన్ని పవిత్రంగా పూజించి ఆయనకు అందజేశారు. ఆయన దాన్ని భక్తితో స్వీకరించడం, విజయం సిధ్ధించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం సమీపంలోని 'గొడుగుపేట' లోని ప్రసన్నాంజనేయ ఆలయం  ప్రసిధ్ధి చెందిన మరో ఆంజనేయుని ఆలయం. ఆగమశాస్త్ర ప్రకారం దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయస్వామి వారిని దర్శించిన వారి కోర్కెలు తీరుతాయని నమ్మిక. ఈ ఆలయ సంప్రోక్షణ సమయంలో 19వ శతాభ్ధిలో కుర్తాళం మఠాధిపతి పూజ చేస్తున్న సమయంలో వర్షం అతిగా కురిసి, అలయం చుట్టూ ఉన్న వీధులు వరద తాకిడికి గురైనా, ఆలయం లోపల మాత్రం ఒక్క నీటి చుక్కైనా పడలేదట!

మరొక యోగాంజనేయ ఆలయం చెన్నయ్ లోని 'క్రోంపేట' దగ్గర ఉంది.1930లో ఈ ప్రాంతంలో నివసించే 13 సంవత్సరాల బాలికకు కలలో ఆంజనేయస్వామి కనిపించి ఆ ప్రాంతంలో తనకు ఆలయం నిర్మించమని ఆదేశించారట. ఆమె తన తల్లి దండ్రులకు చెప్పింది. తరువాత కంచి మఠపీఠాధిపతులు చంద్రశేఖర సరస్వతీ స్వామీజీవారు ఆ ప్రాంతానికి వచ్చినపుడు ఆ బాలిక స్వామిజీతో తన స్వప్నం విషయం చెప్పింది. స్వామీజీ తన భక్తులతో, ఆలయ ప్రాంతంలో వెదికించగా, ప్రస్తుతం ఆలయం నిర్మించబడి ఉన్న ప్రాంతంలో ఆంజనేయ విగ్రహం లభించినట్లు, ఆ తర్వాత 'తిరుమల తిరుపతి దేవస్థానం’ వారు ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర ఆధారంగా తెలుస్తోంది.

భక్తులెవరైనా కష్టాలూ, మానసిక రుగ్మతలూ కలిగినా, పసిపిల్లలకు దడుపు, అనారోగ్యం వంటివి కలిగినా, కార్యసిధ్ధికి ముందుగా పూజించేది హనుమంతుడినే. హనుమాన్ చాలీసా పారాయణం, రామరక్షా కవచం, సుందరాకాండ పారాయణ ఇవన్నీ హనుమద్ భక్తుల పాలిటి కల్పవృక్షమనీ, ఆయన కోరిన వెంటనే అండగానిల్చే ఇలవేల్పు అని భావిస్తాం. ఇలాంటి హనుమదాలయాల దర్శనం మనకందరికీ సుఖశాంతుల యివ్వాలని కోరుకుంటూ ...

జయ జయ హనుమా!

జయ జయ హనుమా.

వానర దూతా వాయుకుమారా !

అతి బలవంతా ! అంజని పుత్రా !

జయ జయ హనుమా !  

జయ జయ హనుమా !

Related Posts