హైదరాబాద్, జూలై 9,
తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఓ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎప్పుడైతే తెలంగాణ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచే వారు క్రమక్రమంతా తమ పార్టీకి గుర్తింపు తీసుకొచ్చిన చాలా విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఇక తెలంగాణ వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ YSR పేరును కూడా తలచుకోలేదు. ఇందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.ఎందుకంటే ఆయన పేరును ప్రస్తావిస్తే ఎక్కడ తెలంగాణ వ్యతిరేకమవుతామనే భావనతోనే ఆయన నినాదాన్ని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల రావడంతో మళ్లీ వైఎస్సార్ అభిమానుల హవా మొదలైంది. దీంతో కాంగ్రెస్ నేతలు అలర్ట్ అవుతున్నారు. ఎక్కడ వైఎస్సార్ అభిమానులు వైఎస్ షర్మిల పార్టీలోకి వెళ్తారో అనే అనుమానంతో వారంతా రూటు మార్చుకున్నారు.ఇక వైఎస్సార్ సెంటిమెంట్ను మొన్నటి దాకా అధినేత రేవంత్ మాత్రమే ఎత్తుకున్నారు. ఆయన తెలంగాణకు ఎంతో చేశారని చెప్పాడు. ఇక ఆయన బాటలోనే ఇప్పడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పయనమయ్యారు. ఆయన కూడా వైఎస్సార్ భజన చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ను కూడా కాపాడుకుంటున్నారు. తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులను అడ్డుకుంటామని, అదే సమయంలో వైఎస్ చేపట్టిన పథకాలను చెబుతూ అందర్నీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇప్పటి దాకా టీఆర్ ఎస్ ప్రభుత్వం, అటు ఏపీ ప్రభుత్వం మధ్య కృష్ణా నీళ్లపై తీవ్రమైన వివాదం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై చేపట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులు చేస్తున్న విమర్శలు తారా స్థాయికి చేరాయి. మంత్రలు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి కలిసి ఏకంగా వైఎస్సార్ ను దొంగ అని జగన్ అయితే గజదొంగ అంటూ సంచలన కామెంట్లు చేశారు. కానీ దీనిపై జగన్ గానీ విజయమ్మ గానీ స్పందించలేదు.ఇక వారు స్పందించకపోవడంతో టీఆర్ఎస్, షర్మిల కలిసి ఏదో కుట్ర చేస్తున్నారనే అనుమానాలను రేవంత్ రెడ్డి వ్యక్తపరిచారు. ఆయనే కాదు చాలామంది ఇదే ప్రశ్నలను సంధించారు. ఇక అలంటి విమర్శలకు చెక్ పెడుతూ వైఎస్ విజయమ్మ తీవ్రంగా కౌంటర్లు వేశారు.వైఎస్సార్ తెలంగాణ పార్టీని షర్మిల ఆవిర్భవించిన సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ తెలంగాణ మంత్రులకు ధీటైన కౌంటర్లు వేశారు. వైఎస్సార్ దొంగ కాదని, ఆయన బిడ్డలు కూడా గజదొంగలు కాదని వారెప్పుడూ ఏపీ, తెలంగాణ ప్రజల కోసమే బతుకుతున్నారని, అందుకోసమే పనిచేస్తున్నారంటూ చురకలు అంటించారు. దీంతో ఇప్పుడు షర్మిలకు కూడా మాట్లాడేందుకు మంచి పట్టు దొరికినట్టయింది. ఇక కాంగ్రెస్ విమర్శలకు కూడా ఆమె చెక్ పెట్టేశారు.