నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
- జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, జూలై 09
గ్రామాలు, పట్టాణాల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతి, పట్టణప్రగతి మరియు హరితహారం కార్యక్రమాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లి గ్రామం మరియు బీర్పూర్ మండలం కేంద్రాలలో నిర్వహిస్తున్న పల్లెప్రగతి పనుల నిర్వహణను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామాలలో మురుగు కాలువల శుభ్రత, ఇంటింటికి అందజేసిన మొక్కల వివరాలు, రికార్డుల ప్రకారం ఇంటి యజమానులకు అందిన అంశాలపై స్వయంగా పరిశీలించి, మొక్కలు సక్రమంగా నాటార లేదా అని తనిఖీ చేశారు. గ్రామంలో కొంతమంది వారి ఇంటి ముందు చెత్తను వేయడం, ఇసుక, కంకర, కర్రలు ఉంచడం గమనించి వాటిని వెంటనే తొలగించి వారి ఇంటి ఆవరణలో ఉంచుకోవాలని సూచించారు. ప్రతిఇంటి నుండి తడిచెత్త, పొడి చెత్తను వేరుచేసి చెత్తను సేకరించే ట్రాక్టర్కు వేరువేరుగా అందజేయాలని ప్రజలకు తెలియజేశారు. గ్రామంలో ఆడుకుంటున్న విద్యార్థులను పలకరించి, వారికి జరుగుతున్న ఆన్లైన్ తరగతుల వివరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నివాసయోగ్యo లేని పాత ఇల్లు, గోడలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
బీర్పూర్ మండలకేంద్రంలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి పనులపై జిల్లా కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తంచేశారు. గ్రామంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించక పోవడంతో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఎం.పి.ఓ లపై ఆగ్రహం వ్యక్తంచేసి రెండు రోజుల్లో పనులు పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు , జిల్లా పంచాయతీ అధికారి ,సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు , ఎంపీడీవోలు, ఎంపీవోలు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.