నారాయణపేట జూలై 10
రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. అందుకు సంబంధించిన కార్యక్రమాలను భవిష్యత్లో అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నారాయణపేటలో ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ ట్రైనింగ్, టెక్స్టైల్ పార్కుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నారాయణపేట చేనేత కళాకారులందరికీ నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు రూ. 10 కోట్లతో నైపుణ్య శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా హ్యాండ్లూమ్, పవర్లూమ్ కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ శిక్షణ కేంద్రం వల్ల చేనేత కార్మికులకు అపారమైన లాభం జరుగుతుందన్నారు. నారాయణపేటలో చేనేత వృత్తికి సంబంధించి గొప్ప కళాకారులు ఉన్నారని ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర పథకాల వల్ల కార్మికులు లాభం పొందుతున్నారు. నేతన్న చేయూత కార్యక్రమం ద్వారా గతేడాది రూ. 96 కోట్లు విడుదల చేశామన్నారు. కరోనా సమయంలో ఈ నిధుల వల్ల కార్మికులకు లాభం జరిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. 50 శాతం సబ్సిడీ మీద నూలు, రసాయనాలను రాష్ర్ట ప్రభుత్వం నేత కార్మికులకు అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని నేత కార్మికులందరూ వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.