న్యూఢిల్లీ, జూలై 10,
ఈ నెల 22 నుంచి పార్లమెంట్ వద్ద 200 మంది రైతులతో పార్లమెంట్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ శనివారం ప్రకటించారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం చర్చించాలనుకుంటే.. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. చర్చలు జరుగకపోయినా.. ఫలప్రదం కాకపోయినా రైతులు నిరననలు చేపడుతారన్నారు. చట్టాలపై రైతులు ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే.. ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు.ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బీకేయూ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ చట్టాల సమస్యపై ఐక్యరాజ్య సమితిని సంప్రదిస్తామని తాము చెప్పలేదన్నారు. జనవరి 26న జరిగిన ఘటనపై దర్యాప్తునకు సంబంధించి మాట్లాడుతూ.. ‘దేశంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టే సంస్థ ఏదైనా ఉందా?.. లేక విషయాన్ని యూఎన్ దృష్టికి తీసుకువెళ్లాలా?’ అని పేర్కొన్నామని స్పష్టం చేశారు. గతేడాది కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.