న్యూఢిల్లీ, జూలై 10,
యూపీ, పంజాబ్ సహా త్వరలో జరగునున్న కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని సంస్థాగతంగా సమూలంగా ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకత్వం భావిస్తోంది. ప్రాంతీయ నేతలను ప్రోత్సహిస్తూ గాంధీ కుటుంబ సభ్యులను అత్యున్నత పార్టీ పదవిని చేపట్టేలా కీలక మార్పులకు తెరతీయాలని యోచిస్తోంది. సీనియర్ నేతలు సచిన్ పైలట్, మల్లిఖార్జున్ ఖర్గే, టీఎస్ సింగ్ దేవ్ వంటి సీనియర్ నేతలను జాతీయ రాజకీయాల్లోకి తీసుకువచ్చి పార్టీని ముందుండి నడిపించేలా వారికి క్రియాశీలక బాధ్యతలను అప్పగించాలని భావిస్తోంది.అసెంబ్లీ ఎన్నికలకు ముందే సంస్ధాగతంగా పార్టీని చక్కదిద్దే దిశగా కాంగ్రెస్ అగ్రనాయకత్వం అడుగులు వేస్తోంది. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య, రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్ మధ్యన విభేదాలు తీవ్రతరం కావడంతో తలనొప్పులు ఎదుర్కొన్న కాంగ్రెస్ ఇక పార్టీని ఐక్యంగా పటిష్టంగా ముందుకునడిపించే టీంపై కసరత్తు సాగిస్తోంది. పార్టీలో పాతతరం, యువనేతల మధ్య సమతూకం పాటిస్తూ జీ 23గా పేరొందిన అసంతృప్త నేతలు లేవనెత్తిన అంశాలపైనా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిసారిస్తోంది.