YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బడ్జెట్ లెక్కలు ఏంటీ

బడ్జెట్ లెక్కలు ఏంటీ

విజయవాడ, జూలై 12, 
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ తీరును అకౌంటెంట్‌ జనరల్‌ (ఎజి) తీవ్రంగా ఆక్షేపించారని విశ్వసనీయంగా తెలిసింది. బడ్జెట్‌లో వాస్తవికత లోపిస్తోందని, గత బడ్జెట్‌లలో లోటుపాట్లను పరిగణనలోకి తీసుకోకుండా కొత్త బడ్జెట్‌ను రూపొందించడం సహేతుకం కాదని తేల్చిచెప్పారు. తాజా బడ్జెట్‌పైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోటుపాట్లను సరిదిద్దాలని రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను ఎజి కోరారు. ప్రధానంగా అవధులు దాటి బడ్జెట్‌ను ప్రవేపెట్టడాన్ని ఎజి కార్యాలయం ప్రత్యేకంగా ప్రస్తావించింది. వార్షికాంతంలో తేలిన లెక్కలను పరిగణనలోకి తీసుకోకుండా మరిరత అధికంగా కొత్త బడ్జెట్‌ను ప్రవేశపెట్టడాన్ని ఎజి కార్యాలయం తప్పుపట్టింది.అందుకు ఉదాహరణలను కూడా నివేదికలో చూపించింది. గతేడాది సొంత పన్నుల ఆదాయం 81,819 కోట్ల రూపాయలు రాగా ఈ ఏడాది ఏకంగా 1.12 లక్షల కోట్లు వస్తాయని ప్రతిపాదించారని పేర్కొంది. మొత్తం ఆదాయం 2019-20లో 1.11 లక్షల కోట్లు, 2020-21లో 1.18 లక్షల కోట్ల రూపాయలు రాగా, ఈ ఏడాది ఏకంగా 1.77 లక్షల కోట్లు వస్తాయని చేసిన ప్రతిపాదనపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం పెరుగుతుందని అంచనా వేయడానికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించింది. వ్యయానికి సంబంధించి కూడా భారీగానే ప్రతిపాదించడాన్ని ప్రస్తావించింది. గతేడాది వాస్తవంగా 1.53 లక్షల కోట్లు ఖర్చు చేయగా, ఈ ఏడాది దాదాపు 30 వేల కోట్లు అదనంగా ఖర్చు చేస్తామని ప్రతిపాదించడం ఎలా సబబని పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఆదాయం తగ్గిపోతున్నప్పటికీ 50 శాతం ఆదాయం అదనంగా వస్తుందని పేర్కొనడంపై ఎజి కార్యాలయం విస్మయాన్ని వ్యక్తం చేయడంతో పాటు, ఆచరణలో ఆ లక్ష్యం చేరుకోవడం అనుమానమేనని వ్యాఖ్యానించింది.పలు శాఖల ద్వారా వచ్చే ఆదాయాన్ని భారీగా పెంచి చూపించారని పేర్కొంది. గత ఏడాది కన్నా స్టారప్స్‌, రిజిస్ట్రేషన్లలో 43 శాతం, రాష్ట్రజిఎస్‌టిలో 64 శాతం, సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని 38 శాతం బడ్జెట్‌లో అదనంగా పెంచి ప్రతిపాదించిన విషయాన్ని ప్రస్తావించింది. పాలనాపరమైన అంశాల ద్వారా వచ్చే ఆదాయం 391 శాతం అదనంగా, విద్య, క్రీడలు, సాంస్కృతిక రంగాల ద్వారా వచ్చే ఆదాయం ఏకంగా 1623 శాతం అదనంగా పెంచి చూపించడం గమనార్హం. అటవీ ఉత్పత్తుల ద్వారా గతేడాది కేవలం 31 కోట్ల రూపాయలు రాగా, ఈ ఏడాది రూ. 500 కోట్లు వస్తుందని చేసిన ప్రతిపాదనలనూ ఎజి కార్యాలయం తప్పు పట్టింది. ఇది ఏకంగా 1500 శాతానికి మించి ఉన్నట్లు వ్యాఖ్యానించింది. ఇక భారీగా చేస్తున్న రుణాలపైనా ఎజి కార్యాలయం ప్రస్తావించింది. 2019-20లో జిఎస్‌డిపిలో 31 శాతంగా ఉన్న రుణం గతేడాది 35.23 శాతానికి పెరిగిపోయిందని, ఈ ఏడాది బడ్జెట్‌లో దానిని ఏకంగా 36.46 శాతంగా అంచనా వేశారని పేర్కొంది. ఇక లోటు కూడా ఆశ్చర్యకరంగానే ఉందని పేర్కొంది. గత ఏడాది 35 వేల కోట్లు వరకు లోటు నిర్ధారణ కాగా, ఈ ఏడాది బడ్జెట్‌లో దానిని కేవలం ఐదు వేల కోట్లుగానే చూపించారని, ఖర్చులకు తగినట్లు ఆదాయాన్ని కూడా పెంచి చూపించడం వల్లనే లోటు తగ్గినట్లుగా చూపించారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది

Related Posts