YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నేను ఈటల మనిషిని... రెండికి చెడ్డ రేవడి పాపం కౌశిక్... కౌశిక్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు

నేను ఈటల మనిషిని...  రెండికి చెడ్డ రేవడి పాపం కౌశిక్...  కౌశిక్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు

కౌశిక్ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి విజేందర్ గా గుర్తించారు. హుజురాబాద్  కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణలో  మాట్లాడిన యువకుడు విజేందర్ మీడియా ముందుకు వచ్చాడు.  కౌశిక్ రెడ్డి తనను ప్రలోభ పెట్టాడని యువకులను తీసుకురావాలని కోరాడని తెలిపాడు. తాను ఈటెల మనిషినని స్పష్టం చేశారు.

పాడి కౌశిక్ రెడ్డి. పీసీసీ మాజీ సారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరి బంధువు. గ్రెస్ పార్టీ కోసం హుజురాబాద్ నియోజకవర్గంలో బాగానే కష్టపడ్డాడు. కష్టానికి తగ్గట్టుగానే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ తెచ్చుకున్నాడు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ఈ నియోజకవర్గంలో గట్టి పోటీనే ఇచ్చాడు. ఎంతంటే, ఒకానొక సందర్భంలో ఈటల తన స్థానం కోల్పోతాడా అన్నంతగా పోటీ ఇచ్చాడు. హుజురాబాద్ బై ఎలక్షన్ లో మళ్ళీ తన సత్తా చాటేందుకు కౌశిక్ సిద్ధమవుతున్నాడు. ఈ దశలో బయటకు వచ్చిన ఓ ఫోన్ సంభాషణ ఆయన రాజకీయ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టింది.
హుజురాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డితో గట్టి పోటీని చవి చూసిన ఈటల రాజేందర్ తిరిగి గెలిచి తన సత్తా చాటారు.  అప్పటినుంచి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ లో కాస్త ఇనాక్టివ్ అయిపోయినా సందర్భం వచ్చినప్పుడల్లా ఈటలను ఏకిపారేసేవాడు. ఈలోగా ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడం గులాబీ బాస్ భర్తరఫ్ చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి తన స్వరాన్ని పెంచారు. టీఆర్ఎస్ నాయకులకంటే తానే పదే పదే ప్రెస్ మీట్ లు పెట్టి ఈటలను విమర్శించాడు. దింతో కౌశిక్ టీఆర్ఎస్ లో చేరుతాడనే ఊహాగానాలు వచ్చాయి.
ఈ ఎపిసోడ్ నడుస్తుండగానే ఈటల రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యం అయింది. టీఆర్ఎస్ ఇప్పటికి అభ్యర్థి విషయంలో తర్జనభర్జన పడుతుండడంతో కౌశిక్ కు గులాబీ వైపు మనసు మళ్లింది. అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తూనే టీఆర్ఎస్ లో చేరి గులాబీ టిక్కెట్ తెచ్చుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు నియోజకవర్గ పరిధిలో ప్రచారం జరిగింది. కొద్దీ రోజుల్లో ఇది నిజం కాబోతుండగా తొందరపడ్డ కౌశిక్ ఫోన్ లో ముందే కూసి రెంటికి చెడ్డ రేవడిలా మారాడు.
కమలాపూర్ మండలం మాదన్నపేట గ్రామానికి చెందిన విజేందర్ అనే యువకుడితో మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి అడ్డంగా బుక్ అయ్యాడు. ఆ ఆడియో కాస్త ఫోన్ లో వైరల్ కావడం కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు పంపడంతో ప్రస్తుతం అటు గులాబీలో చోటు దక్కక... ఇటు కాంగ్రెస్ టికెట్ దక్కదని కౌశిక్ ప్రస్తుతం తల పట్టుకున్నాడట. ఆడియో ఇంతలా వైరల్ కావడంతో టీఆర్ఎస్ ఎలాగు చేర్చుకోదు...  క్రమశిక్షణ ఉల్లంఘించాడని ప్రజల్లో మైనస్ అవుతుందని కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వదు… దింతో ప్రస్తుతం హుజురాబాద్ నియోజకవర్గంలో అయ్యో కౌశిక్ అని అందరూ భాదపడిపోతున్నారట. ఈటల శిబిరంలో మాత్రం ఎంతో కొంత ఓట్లకు గండి కొట్టే అడ్డంకి తొలగిందని సంబరపడి పోతున్నారట. ఏదిఏమైనా కౌశిక్ తొందరపడి అలా ముందుగానే ఫోన్ లో కూయడం ఆయనకు రాజకీయంగా భారీ నష్టాన్నే కలిగిస్తోంది.

కౌశిక్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. కౌశిక్ రెడ్డి పై ఇప్పటికే జిల్లా కాంగ్రెస్ నుంచి అనేక పిర్యాదులు అందాయి. గతంలోనే కేటీఆర్ తో సాన్నిహిత్యంగా ఉన్న వీడియో వైరల్ అయ్యిందని అయన అన్నారు. అప్పుడే గాంధీభవన్ పిలిచి మండలించాం. అయినా ఆయన వైఖరిలో మార్పు రాలేదని అన్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ వైరల్ అవుతున్న ఆడియో లో కౌశిక్ టీఆర్ఎస్ తో అంతర్గత సంబంధాలు కలిగివున్నాడు అని తేలిపోయింది. కౌశిక్ రెడ్డి కీ షోకాజ్ నోటీసు ఇచ్చాం. 24 గంటల సమయంలో సమాధానం ఇవ్వాలని చెప్పాం. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకుంటే పార్టీ నుంచి బహిష్కరిస్తామని అయన అన్నారు. 

Related Posts