న్యూఢిల్లీ జూలై 12
కరోనా థర్డ్ వేవ్పై భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) చీఫ్ డాక్టర్ జేఏ జయలాల్ ఆందోళన వ్యక్తం చేసారు. పండగల నిర్వహణ ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజలు పెద్దసంఖ్యలో గుమికూడే ఎలాంటి కార్యక్రమాలకూ అనుమతించరాదని ఐఎంఏ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పూరి, అహ్మదాబాద్లో జగన్నాధ్ రధయాత్రలకు అనుమతించిన నేపథ్యంలో డాక్టర్ జయలాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జులై 25 నుంచి కరోనా నిబంధనలు పాటిస్తూ కన్వర్ యాత్రను నిర్వహించేందుకు యూపీ ప్రభుత్వం అనుమతించింది. కొవిడ్-19 థర్డ్ వేవ్ ముంచెత్తుతుందనే అంచనాల నడుమ కన్వర్ యాత్రకు అనుమతిన్చాదాన్ని జయలాల్ వ్యతిరేకించారు. కరోనా వ్యాప్తితో గత ఏడాది కన్వర్ యాత్రను రద్దు చేశారు. కొవిడ్-19 ప్రొటోకాల్ను అనుసరిస్తూ యాత్ర జరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం యోగి ఆదిత్యానాధ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కన్వర్ యాత్రను జులై చివరలో శ్రావణ మాస ఆరంభం నుంచి ఆగస్ట్ ప్రధమార్ధం వరకూ దాదాపు పదిహేను రోజుల పాటు చేపడతారు. యూపీ, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లకు చెందిన శివభక్తులు అధికంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.