తిరుపతి, జూలై 14,
వైసిపి ఫైర్ బ్రాండ్, డేరింగ్ లేడీ.. ఎమ్మెల్యే ఆర్కె.రోజాను వైసిపి అధిష్టానం పక్కన పెడుతోందా? గత కొంత కాలంగా పార్టీలో ఆమెకు ప్రాధాన్యత సన్నగిల్లిందా? నగరి నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న గ్రూపు రాజకీయాలను చూస్తుంటే.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత రెండు సాధారణ ఎన్నికల్లోనూ నగరి నియోజకవర్గం నుంచి వైసిపి తరుఫున ఎమ్మెల్యేగా రోజా ఎన్నికయ్యారు. వైసిపి ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలోనూ.. గత ఎన్నికల్లో ప్రచారంలోనూ.. వైసిపి అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనూ ప్రతిపక్ష నేతలపై మాటల తూటాలు పేల్చుతూ ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రతిపక్ష హోదాలో ఉన్న సమయంలోనూ, ఆయనతోపాటు ఆ పార్టీ నేతలను సైతం ఉక్కిరిబిక్కిరి చేసేలా రోజా వ్యాఖ్యలు ఉండేవి. ఎలాంటి బెరకూ లేకుండా మీడియా ముందే తీవ్ర స్థాయిలో విరుచుకుపడేది. అలాంటి సమయంలో అధికారంలోకి వచ్చిన వైసిపి.. రోజాకు మంత్రి పదవి కట్టబెడుతుందని అందరూ ఊహించారు. అయితే, అందరి ఊహలను పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమెను తన మంత్రి వర్గంలోకి తీసుకోలేదు. ఎపిఐఐసి చైర్మన్ పదవితో సరిపెట్టారు. అయితే, వైసిపి ఫైర్ బ్రాండ్గా పేరొందిన రోజా.. గత కొంత కాలంగా ప్రతిపక్ష టిడిపిపై ఒకప్పటిలా కాకుండా అప్పుడప్పుడు అడపాదడపా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. రోజాకు అధిష్టానం సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్లే కొంత కాలంగా ఆమె ఆచీతూచీ నడుచుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల ఎపిలో జరిగిన కార్పొరేషన్, జెడ్పిటి, ఎంపిటిసి ఎన్నికల సమయంలో నగర నియోజకవర్గంలో వర్గ బేధాలు బయటపడ్డాయి. తాను నిలబెట్టిన అభ్యర్థులను ఓడించేందుకు ఆ వర్గం పనిచేసిందంటూ రోజా ఆరోపిస్తూ వచ్చారు. అంతేకాదు, ఆ వర్గం సాధారణ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేయడం వల్లే తక్కువ మెజారిటీ వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా, రోజా వైసిపి ఫైర్ బ్రాండ్ అయినా.. డేరింగ్ లేడీ అయినా.. నియోజకవర్గంలో ఆమెకు అంత సీన్ లేదంటూ ఆ వర్గం ఎప్పటి నుంచో చెప్పుకొస్తుంది. తాజాగా వైఎస్ జయంతి వేడుకల్లోనూ రోజా వర్సెస్ శాంతి గ్రూప్ అంటూ రెండు గ్రూపులుగా వైఎస్ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఈ రెండు గ్రూపుల మధ్య నడుస్తున్న వార్ మరోసారి బట్టబయలైంది.ఇదిలా ఉండగా, నియోజకవర్గ స్థాయిలో అయినా, రాష్ట్ర స్థాయిలో అయినా.. ఏదైనా కార్పొరేషన్ పదవికి చైర్మన్ను నియమించాలంటే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభిప్రాయం తీసుకుంటారు. అయితే, నగరిలో ఎమ్మెల్యే రోజా ఉన్నప్పటికీ ఆమెతో ఏమాత్రం పొసగని లోకల్ పాలిటిక్స్లో మంచి పట్టున్న కెజె కుమార్ భార్య శాంతికి ఇటీవల ఈడిక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీలో రోజాకు ఇచ్చే ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది. మొదటి నుంచి కెజె కుమార్ వైసిపిలో జగన్కు దగ్గర మనిషిగా పనిచేస్తున్నారు. కెజె కుమార్ భార్య శాంతి ఇది వరకే మున్సిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్గా పనిచేశారు. ఈ కారణాలతో కెజె కుమార్ను అధిష్టానం ప్రోత్సహిస్తోందనే వార్తలూ వినిపిస్తున్నాయి.