YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఇక టీడీపీ దూకుడు....

ఇక టీడీపీ దూకుడు....

గుంటూరు, జూలై 15, 
ప్రధాన ప్రతిప‌క్ష నేత‌, టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. గ‌తానికి భిన్నంగా ఆయ‌న నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. ఈ ఒక్క విష‌యంలో చంద్రబాబు చాలా స్పీడ్‌గా తీసుకుంటోన్న నిర్ణయాల‌తో పార్టీ నేత‌లే అవాక్కవ్వడంతో పాటు చంద్రబాబు మార‌ర్రా బాబు అని చ‌ర్చించుకుంటున్నారు. అస‌లు మ్యాట‌ర్‌లోకి వ‌స్తే గ‌త ఎన్నిక‌ల్లో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఓడిపోయింది. దీంతో ఓడిపోయిన వారు చాలా మంది దూరంగా ఉంటున్నారు. కొంద‌రు పార్టీ మారి వైసీపీలోకి.. బీజేపీలోకి కూడా జంప్ చేశారు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌లు లేకుండా పోయార‌నే వాద‌న తెలిసిందే. కొద్ది రోజుల వ‌ర‌కు ఉన్న నివేదిక‌ల్లో పార్టీకి ఏపీలో ఉన్న 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో 30 కు పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌చార్జ్‌లు లేని ప‌రిస్థితి.అయితే..అదే స‌మ‌యంలో త‌మ‌కు ప‌గ్గాలు అప్పగిస్తే.. పార్టీని ప‌రుగులు పెట్టిస్తామంటూ.. కొంద‌రు యువ నాయ‌కులు, ఎన్నారైలు అనేక మార్లు విన్నవించినా చంద్రబాబు పెద్దగా ప‌ట్టించుకోలేదు. నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యేల సీట్లు ఇచ్చే విష‌యంలో చంద్రబాబుకు నాన్చడం ఎప్పుడూ ఉన్న అల‌వాటే. ఈ విష‌యంలో ఎప్పుడూ స‌రైన డెసిషన్లు తీసుకోక‌పోవ‌డంతోనే పార్టీని వీడి చాలా మంది నేత‌ల‌కు బ‌య‌ట‌కు వెళ్లిన సంద‌ర్భాలు ఉన్నాయి.. పార్టీ చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో దెబ్బలు తింది. దీంతో చంద్రబాబు నిర్ణ‌యం ఒక జీవిత‌కాలం లేటు..! అనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే గ‌తానికి భిన్నంగా ఇప్పుడు చంద్రబాబు ఆలోచిస్తున్నారు. తాజాగా మారుతున్న ప‌రిణామాలు.. వైసీపీ దూకుడు నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం ద‌క్కించుకునేందుకు ఇప్పటి నుంచి చ‌ర్యలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్రబాబు గ్రహించిన‌ట్టు క‌నిపిస్తోంది.అందుకే ఆయ‌న క్షేత్రస్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేదిశ‌గా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ఇన్‌చార్జ్‌లు లేకుండా ఖాళీగా ఉన్న ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. మ‌రీ ముఖ్యంగా అనంత‌పురం జిల్లాలో సీనియ‌ర్ టీడీపీ కుటుంబం ప‌రిటాల ఫ్యామిలీ ఎప్పటి నుంచో కోరుతున్న రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను అప్పగించేశారు. రాప్తాడును మాజీ మంత్రి సునీత‌కు, ధ‌ర్మవ‌రం నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌రిటాల శ్రీరాంకు అప్పగించేశారు చంద్రబాబు. అయితే దీనిపై అధికారిక ప్రక‌ట‌న రావాల్సి ఉంది. విశాఖ‌ప‌ట్నం జిల్లాలోకీల‌క నియోజ‌క‌వ‌ర్గం భీమిలి ఇంచార్జ్‌గా కోరాడ రాజాబాబును నియ‌మించారు. ఇక్కడ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన స‌బ్బం హ‌రి ఇటీవ‌ల మృతి చెందిన విష‌యం తెలిసిందే.ఇక‌, ప్రకాశం జిల్లా ద‌ర్శి ఇంచార్జ్‌గా ప‌మిడి ర‌మేష్‌కు అవ‌కాశం ఇచ్చారు. ఇక్కడ మాజీ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు.. వైసీపీలో చేరిన విష‌యం తెలిసిందే. గుంటూరు జిల్లా మాచ‌ర్లలో మాజీ ఇన్‌చార్జ్‌ చ‌ల‌మారెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పటి వ‌ర‌కు త్రిశంకు స్వర్గంగా ఉన్న కృష్ణాజిల్లా తిరువూరు నియోజ‌క‌వ‌ర్గాన్ని..ఎన్నారై సామ‌ల దేవ‌ద‌త్తకు అప్పగించారు. ఏలూరును మాజీ ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి సోద‌రుడు బ‌డేటి చంటికి ఇచ్చారు. కొవ్వూరును మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్‌కే ఇచ్చేలా లైన్ క్లీయ‌ర్ చేశారు. చింత‌ల‌పూడిని మ‌ళ్లీ మాజీ మంత్రి పీత‌ల సుజాత‌కే ఇస్తాన‌ని హామీ ఇచ్చేశారు. ఇలా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీకి ఇంచార్జ్‌ల‌ను నియ‌మించే కార్యక్రమాన్ని చంద్రబాబు వేగవంతం చేశారు. దీని ప్రకారం వ‌చ్చే ద‌స‌రా నాటికే ఈ నియామ‌కాలు పూర్తి చేసి.. పార్టీని ప‌రుగులు పెట్టించాల‌నేది చంద్రబాబు వ్యూహంగా ఉంద‌ని అంటున్నారు పార్టీ సీనియ‌ర్లు.

Related Posts