YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ లెక్కలు తీస్తున్నారు

తెలంగాణ లెక్కలు తీస్తున్నారు

విజయవాడ, జూలై 17, 
తెలుగు సినిమాలో గుర్తుకొస్తున్నాయి అన్న పాట ఉంది. ఇపుడు ఏపీ సీఎం జగన్ కి కూడా అలాగే అన్నీ గుర్తుకువస్తున్నాయి. చేతికి ఎముక లేదు అనిపించుకోవడానికి దొరికిన కాడిని అప్పులు చేసి మరీ సంక్షేమ పధకాలు పేరిట పంచుడు ప్రోగ్రాం చేశారు. ఇపుడు ఏపీ ఆర్ధిక పరిస్థితి పతనం అంచున ఉంది. ఒక్క రూపాయి అప్పు కొత్తగా పుట్టే సీన్ లేదు. మరో వైపు చూస్తే దైనందిన వ్యవహారాలకు కూడా డబ్బులు లేని దారుణమైన పరిస్థితి. కేంద్రం రుణ పరిమితి విధించడంతో ఏపీ సర్కార్ కి చేతులూ కాళ్ళూ ఆడడంలేదు. ఈ నేపధ్యంలో జగన్ కి మనం అప్పులు చేయడం కాదు, మనకు ఎవరు బాకీలు ఉన్నారు అన్న సంగతి గుర్తుకొస్తున్నాయి.
తెలంగాణాతో సంబంధాలు బాగా ఉన్న రోజుల్లో ఏమీ గుర్తుకురాలేదు. ఆలింగనాలు, పిచ్చాపాటీ ముచ్చట్లు, బిర్యానీ విందులతో తొలి ఆరు మాసాలు జగన్ కేసీయార్ దోస్తీ గడిచింది. కేసీయార్ కి ఏం పోయింది. ఆయనది సంపన్న రాష్ట్రం. పైగా ఏపీతో స్నేహంగా ఉంటే వారు కూడా ఏమీ అడగరన్న గడుసుతనాన్ని ప్రదర్శించారు. జగన్ దానికి పొంగిపోయారు. అందువల్ల విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవి ఏవీ అడగ‌కుండానే పొద్దు పుచ్చారు. ఇపుడు కృష్ణా జలాల పేరిట కేసీయార్ నానా యాగీ చేశాక కానీ జగన్ కి తత్వం బోధపడలేదు. దానికి తోడు, అప్పులతో పుట్టలా తయారైన ఏపీకి అర్జంటుగా డబ్బులు కావాలి. దాంతో తెలంగాణా సర్కార్ ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు గుర్తుకు వచ్చాయట. ఇపుడు జగన్ కరెక్ట్ రూటు లో పడ్డారని అంటున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి 6 వేల 112 కోట్ల రూపాయలు రావాలని లెక్కలు తేల్చారు. వీటిని గట్టిగా అడగాలని కూడా వైసీపీ ఎంపీలకు జగన్ చెప్పారుట. పార్లమెంట్ లో డిమాండ్ చేయడం ద్వారా కేంద్రం జోక్యం చేసుకుని తెలంగాణా నుంచి ఇప్పించాలని కోరుతున్నారుట. అదే విధంగా కేంద్రం నుంచి ఏపీకి ఎంత రావాలి అన్న దాని మీద కూడా చిట్టాపద్దులు తీయించారుట. అవి కూడా వేల కోట్లలో ఉన్నాయి. మరి వాటి మీద పోరాడాలని ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అంటే ఈ నిధులు అన్నీ వస్తే ఏపీ బండి కదులుతుంది. అప్పులు చేయకుండా కొంతకాలం అయినా గడపవచ్చు అన్నది జగన్ ఆలోచనగా ఉందిట. ఇక ఏపీకి తెలంగాణా నుంచి చాలా రావాలి. విభజన తరువాత ఉమ్మడి ఆస్తులు అన్నీ కూడా తెలంగాణాలోనే ఉండిపోయాయి. వాటి లెక్కలు కూడా తేల్చాలి. నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది తిరగకుండానే ఉమ్మడి రాజధానిని వదులుకుని విజయవాడ వచ్చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో చిక్కుకుని అలా ఆస్తులన్నీ వదిలేశారు. జగన్ స్నేహమనే భ్రాంతిలో పడి రెండేళ్ళుగా నోరెత్తడంలేదు. ఇపుడు వాటి కధ కూడా తేల్చితే ఏపీకి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది అని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. ఏపీ అప్పుల పాలు కాకుండా ఉండాలి అంటే తెలంగాణా నుంచి న్యాయంగా రావాల్సింది దక్కించుకోవాలి. ఈ విషయంలో కేంద్ర సాయం తీసుకోవాలి. అదే విధంగా కేంద్రం నుంచి కూడా పెద్ద ఎత్తున రావాల్సిన నిధులు వ్యూహం ప్రకారం తెచ్చుకోవాలి. అంతే తప్ప అప్పులు దొరికాయి కదా అని చేసుకుంటూ పోతే ఏపీ చితికిపోవడం ఖాయమేనని మేధావులు చెబుతున్నారు. మరి జగన్ రూట్ కరెక్టేనట.

Related Posts