YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విజయసాయి... చెబితేనే పదవులు

విజయసాయి... చెబితేనే పదవులు

విశాఖపట్టణం, జూలై 17, 
వడ్డించేవారు మ‌న‌వాడైతే.. మ‌నం ఏ బంతిలో కూర్చున్నా.. ఇబ్బందిలేద‌న్న‌ట్టుగా ఉంది.. వైసీపీలో కొంద‌రి నేత‌ల ప‌రిస్థితి. వాస్త‌వానికి ఏ పార్టీలో అయినా.. కొద్దిపాటి గుర్తింపు కోసమే నేత‌లు అల్లాడిపోతున్నారు. దీనికిగాను పార్టీ జెండా ప‌ట్టుకుని హ‌డావుడి చేయ‌డ‌మో.. లేక మీడియా మీటింగులు పెట్టి ప్ర‌త్య‌ర్తుల దుమ్ముదుల‌ప‌డ‌మో చేస్తుంటారు. ఇక‌, ప‌ద‌వులు ఆశించే వారైతే మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డాలి. అధినేత దృష్టిలో ప‌డేందుకు అహ‌ర‌హం శ్ర‌మించాలి. ఇది.. ఏ పార్టీలో అయినా ఉన్న‌దే. అయితే.. ఇప్పుడు చిత్రంగా వైసీపీలో కొత్త ముఖాల‌కు అడిగిందే త‌డ‌వుగా ప‌ద‌వులు ద‌క్కుతున్నాయ‌ట‌!అయితే.. ఇక్క‌డ ఒకే ఒక్క ష‌ర‌తు ఉంది. అందేంటంటే.. పార్టీలో నెంబ‌ర్ 2గా ఉన్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఆశీస్సులు ఉంటే చాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. ఆయ‌న ఆశీస్సుల‌తో ఎలాంటి హ‌డావుడి లేకుండా ప‌ద‌వులు పొందిన వారి ఉదాహ‌ర‌ణలు ఈ సంద‌ర్భంగా పేర్కొంటుండ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌న‌గ‌రం జిల్లా గిరిజన కార్పొరేషన్‌ అధ్యక్ష పదవి విష‌యంలో ఇలాంటి క‌థే న‌డిచింద‌ని జిల్లాలో పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు. గిరిజన కార్పొరేషన్‌ అధ్యక్ష పదవి జిల్లా పరిషత్‌ మాజీ చైర్‌పర్సన్‌ శోభా స్వాతీరాణికి ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి విజ‌య‌న‌గ‌రంపై బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు ప‌ట్టు ఎక్కువ‌.ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. అయితే ఆయ‌న‌కు కూడా చెక్ పెట్టేలా విజ‌య‌సాయిరెడ్డి వ్యూహాత్మ‌కంగా త‌న వ‌ర్గాన్ని ఇక్క‌డ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ నుంచి వ‌చ్చిన శోభా స్వాతిరాణిని త‌న కూట‌మిలో చేర్చుకున్నారు. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. శోభ ఎక్క‌డా.. బ‌య‌ట‌కు రారని, ఏం చేయాల‌న్నా.. ఫోన్ల‌పైనే లాగించేస్తార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారంలో ఉంది. అంతేకాదు… ఎప్ప‌టి నుంచో పార్టీలో ఉన్న వారికి… జెండాలు మోసిన వారికి.. గ‌త స‌ర్కారు హ‌యాంలో లాఠీ దెబ్బ‌లు తిన్న‌వారికి కూడా ద‌క్క‌ని.. ఇమేజ్‌.. శోభ‌కు ద‌క్కుతోంద‌న్న‌ది పెద్ద టాక్‌.వాస్త‌వానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో శోభాస్వాతీరాణి అనూహ్యంగా తెరపైకి వచ్చారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో సాలూరు అసెంబ్లీ, అరకు పార్లమెంటరీ అభ్యర్థిత్వాన్ని ఆశించారు. కానీ ఇవేవీ దక్కలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. అయినా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. పార్టీ శ్రేణులు కూడా ఆమెను పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. కానీ, విజయ సాయిరెడ్డి వ‌ర్గంగా మాత్రం ప్ర‌చారంలో ఉన్నారు. ఇటీవల అనూహ్యంగా నామినేటెడ్‌ పదవుల కేటాయింపులో ఆమె పేరు తెరపైకి వచ్చింది. త్వ‌ర‌లోనే గిరిజ‌న కార్పొరేష‌న్ జిల్లా ప‌ద‌వులు ఇస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.ఈ జాబితాలో ఫ‌స్ట్ పేరు శోభ‌దే కావ‌డం.. ఆస‌క్తిగా మారింది. దీనిపై పార్టీలో.. ముఖ్యంగా గిరిజన సంఘాల నేతల్లో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆవిర్భావం నుంచీ సేవలందించిన గిరిజన నేతలను కాద‌ని.. ఉద్యోగాలను సైతం వదిలి పార్టీ బలోపేతానికి శ్రమించిన వారిని ప‌క్క‌న పెట్టి నిన్న‌గాక మొన్న వ‌చ్చిన వారికి ప‌ద‌వులు ఇస్తారా ? అనేది ఇప్పుడు పెద్ద‌టాక్‌. ఇక విశాఖ జిల్లాలో ప‌లు నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీలో స్థానిక నేత‌లు, మంత్రులు, ఎమ్మెల్యేల‌కు కాకుండా సాయిరెడ్డి చెప్పిన వారికే ప‌ద‌వులు వ‌స్తున్న‌ట్టు భోగ‌ట్టా ? అయితే, ఇంత జ‌రుగుతున్నా.. ఎవ‌రూ నోరు మెద‌ప‌క పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి విజయ సాయిరెడ్డా మ‌జాకా! అంటున్నారు ప‌రిశీల‌కులు.

Related Posts