గుంటూరు, జూలై 17,
రానున్న ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఎన్నికలకు మూడేళ్లు ఉండగానే ప్రజల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్ సంక్షేమ పథకాలతో తనకు ప్రత్యేక ఓటు బ్యాంకును ఏర్పరచుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికలలో గతంలో మాదిరి వన్ సైడ్ విజయం సాధించాలన్నది జగన్ ప్రయత్నం. కానీ ఈసారి మూడు జిల్లాలు మాత్రం జగన్ కు ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. ఇటీవల వైసీపీ జరిపించిన అంతర్గత సర్వేలోనూ ఈ మూడు జిల్లాల్లో పరిస్థితి బాగా లేదని నివేదిక అందింది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ పార్టీకి కొంత వ్యతిరేకత కనపడుతుందని తేలింది. ఇందుకు ప్రధాన కారణం రాజధాని అమరావతిని తరలించడమేనని, ఆ నిర్ణయం వల్లనే ఇక్కడ వైసీపీకి మైనస్ గా మారినట్లు తెలుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణ పనులు నిలిపివేయడం, మూడు రాజధానుల ఏర్పాటుకు ముందుకు వెళ్లడం కారణంగా ఈ మూడు జిల్లాల్లో భూముల ధరలు పూర్తిగా పడిపోయాయి. గతంలో అమరావతిని రాజధానిగా ప్రకటించిన వెంటనే గుంటూరు నుంచి ఏలూరు వరకూ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కొందరు తమ భూములను విక్రయించగా, మరికొందరు మాత్రం ఇంకా ధర పెరుగుతుందని అలాగే ఉంచారు.కానీ రాజధాని తరలింపుతో భూముల ధరల పడిపోయి ఇక్కడ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. దీనికి తోడు ఇక్కడ వ్యాపారాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఉపాధి అవకాశాలు కరువయ్యాయి. రాజధాని రాకతో ఈ మూడు జిల్లాల ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినా సాధారణ ఎన్నికల్లో మాత్రం జగన్ పార్టీకి ఈ మూడు జిల్లాలు దెబ్బేస్తాయన్న టాక్ బలంగా వినపడుతుంది. దీంతో ఈ మూడు జిల్లాలపై రానున్న కాలంలో జగన్ ప్రత్యేక శ్రద్ధ పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.