YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రేమ పేరుతో వల..

ప్రేమ పేరుతో వల..

ప్రేమ పేరుతో వల.. 
ముగ్గురితో పెళ్లి...
నిత్య పెళ్లి కూతురు లీలలు
అనాథగా పరిచయం చేసుకుంటుంది. తనకు ఎవరూ తోడు లేరంటూ ప్రేమ పేరుతో వలపు వల విసురుతుంది. ఆమె వలలో పడిన వారిని పెళ్లి చేసుకుంటుంది. అనంతరం డబ్బులు, నగదుతో పరారవుతుంది. ఇలా పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసి అనంతరం నగదు, నగలుతో ఉడాయించే నిత్య పెళ్లి కూతురును చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
సీఐ దేవేంద్రకుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. విజయపురం మండలం నాగరాజకండ్రిగ కు చెందిన సునీల్‌కుమార్‌ (29) మార్కెటింగ్‌ ఉద్యోగం చేసుకుంటూ తిరుపతిలోని సత్యనారాయణపురంలో నివసిస్తున్నాడు. సునీల్‌కు ఏడీబీ ఫైనాన్స్‌లో పనిచేసే సుహాసినితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. దాంతో పెద్దల సమక్షంలో గత ఏడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. సుహాసిని తాను అనాథను అని చెప్పడంతో సునీల్‌కుమార్ తల్లిదండ్రులు 20 గ్రాముల బంగారం కానుకగా ఇచ్చారు. ఆ తర్వాత ఆమె మాయ మాటలు చెప్పి సునీల్‌ తండ్రి వద్ద రూ.2లక్షలు తీసుకుంది. అలాగే బంధువుల వద్ద కూడా అప్పు చేసింది. ఈ విషయం తెలుసుకున్న సునీల్‌, సుహాసిని నిలదీయడంతో గొడవ జరిగింది. అనంతరం ఈ ఏడాది జూన్‌ 8న ఏమీ తెలియనట్లు ఇంట్లో నుంచి నెమ్మదిగా జారుకుంది.
భార్య కనిపించక పోవడం తో ఆమె వస్తువులు అన్నీ వెతకగా ఆధార్‌కార్డ్ లభించింది. ఆ ఆధార్‌కార్డ్ ఆధారంగా విచారించగా ఆమెకు అప్పటికే నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లుతో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిసింది. అలాగే ఏడాది క్రితం వినయ్ అనే మరో వ్యక్తిని కూడా పెళ్లి చేసుకుని ఇలాగే మోసం చేసిందని తెలుసుకున్నాడు. దీంతో సునీల్‌కుమార్ జూన్‌ 13న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు నిత్యపెళ్లికూతురు సుహాసిని కోసం గాలిస్తుండగా తిరుపతి స్విమ్స్‌ వద్ద వివేకానంద సర్కిల్‌ వద్ద సుహాసిని ప్రత్యక్షమైంది. ఆమెను చూసిన పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
మరోవైపు రెండేళ్ల క్రితం తనను కూడా ఇలాగే సుహాసిని పెళ్లి చేసుకుని తనను మోసం చేసిందని రెండో భర్త కొత్తగూడెంకు చెందిన వినయ్ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తనతో పెళ్లి జరిగిన తర్వాత రూ.15 లక్షలు తీసుకుందని ఆరోపించాడు. తాను మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, అప్పటి సీఐ ఫిర్యాదు స్వీకరించలేదన్నారు. ఇది జరిగిన కొన్నిరోజులకే ఇంట్లో నగదు, బంగారం తీసుకుని సుహాసిని పారిపోయిందన్నాడు.  తనకు 2018లో సుహాసిని అనాథగా పరిచయమైందని.. ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి ప్రతిపాదన తీసుకురావడంతో 2019 మే 22న ప్రేమ వివాహం చేసుకున్నట్లు వినయ్ తెలిపాడు. ఆ తరువాత తమ కుటుంబ సభ్యులు, బంధువుల దగ్గర నుంచి రూ.10 లక్షలు తీసుకుందని తెలిపాడు. అయితే రెండు నెలల తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు రావడం గమనించానన్నాడు. అంతకు ముందే సుహాసిని తన మేనమామ అంటూ నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాళేనికి చెందిన మొదటి భర్తని తనకు పరిచయం చేసిందన్నాడు. తన ఇద్దరు పిల్లలనే మేనత్త పిల్లలని నమ్మించిందని ఆ వీడియోలో తెలిపాడు.  ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆరా తియ్యగా తనకు మేనమామగా పరిచయం చేసిన వ్యక్తే సుహాసిని భర్త అని.. ఆ పిల్లలు వారికే పుట్టినట్లు తెలిసిందన్నాడు. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించినా వారు స్పందించ లేదన్నారు. ఆమరుసటి రోజే ఆమె తన ఇంట్లో నుంచి వెళ్లిపోయిందన్నారు. పోలీసులు పట్టించుకోక పోవడంతో తనను ఎవరూ ఏమీ చేయలేరనే గర్వంతో ఆమె ఉండేదని బాధితుడు, రెండో భర్త వినయ్ ఆ వీడియో లో తెలిపిన సంగతి తెలిసిందే.
మెుత్తానికి నిత్య పెళ్లి కూతురును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో.. ఆమె బాధితులు ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Related Posts