కరీంనగర్
వీణవంక మండలం చల్లూర్ గ్రామంలోని వెంకటేశ్వర గార్డెన్ లో బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, బొడిగె శోభ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు హజరయ్యారు.హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా, లేకున్నా ఇక్కడి ప్రజల కోసం ఎంతో పనిచేసాను. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఉద్యమకాలంలోనూ శక్తివంచన లేకుండా పనిచేసాను. చట్టాలను తమ చుట్టాలుగా వాడుకునే నీచ సంస్కృతి నడుస్తోంది. చిల్లర రాజకీయాలను ప్రజలు సపోర్టు చేయరు. వాళ్లు ఇవన్నీ అసహ్యహించుకుంటున్నారు. ప్రజల్లో బలమున్నవారు చేసే పనులు ఇవి కావు. బలహీనులు కాబట్టే వాళ్లు ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారు. ఆరిపోయే ముందు దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లుగా.. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. హుజురాబాద్ ఒక్కటే కాదు.. అంతటా ఇలాంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు ఓపిక, సహనంతో పనిచేయాలి. మోడీ సర్కారు సామాజిక న్యాయాన్ని పాటిస్తోంది. అందుకే 27 మంది ఓబీసీలకు మంత్రివర్గంలో స్థానమిచ్చారు. సహజ న్యాయసూత్రాలను పాటించే పార్టీ బీజేపీ మాత్రమే. ఎస్సీల జనాభా 16-17 శాతం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మాల, మాదిగలలో ఒక్కరికే మాత్రమే అవకాశం ఇచ్చారు. 0.5శాతం ఉన్న కులాల వారు ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఎదురుదాడులకు, చిల్లరదాడులకు భయపడబోము. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు తప్ప, ఆత్మగౌరవాన్ని పోగొట్టుకోరని అన్నారు.