హుజూరాబాద్
మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర సోమవారం ఉదయం కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుండి ప్రారంభం అయింది. బత్తినివానీపల్లి లో ఆంజనేయస్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు చేసిన తరువాత అయన పాదయాత్ర ప్రారంభించారు. శనిగరం, మాదన్న పేట, గునిపర్తి , శ్రీరాముల పేట, అంబలలో కొనసాగింద. 23 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం ఈటల పాదయాత్ర చేస్తారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఈ పాదయాత్ర పది రోజుల క్రితమే ప్రకటించాం. మా పాదయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదే. కానీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. నిన్న ఓ రైస్ మిల్లును కార్యకర్తలకు భోజనాల కోసం మాట్లాడుకుంటే.. ఆయనను బెదిరించారు. ఓడిపోతామన్న భయంతో ఇలాంటి చిల్లర పనులు కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే మీకు గుణపాఠం తప్పదు. మేము ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదు. ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నాని అన్నారు.
కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం ఇక్కడి నుంచే మొదలవుతుంది. హుజురాబాద్ లో ప్రచారం చేస్తున్న ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు మీకు దమ్ముంటే ముందు మీ దగ్గర పథకాలు అమలు చేయాలి. యావత్ తెలంగాణ ప్రజలు విముక్తి కావాలంటే తొలి అడుగు ఇక్కడినుంచే పడాలని ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ మాకు అడ్డంకులు సృష్టించాలని, నీచపు పనులు చేయాలని చూస్తే ఖబర్ధార్ . ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని చేయడం సరికాదు. చిల్లర వేషాలు వేసేవారిని వదిలిపెట్టం. నా పాదయాత్రకు అండగా ఉండేందుకు అనేక వర్గాల ప్రజలు, అన్ని యూనివర్శిటీలు విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చారు. ఈ పాదయాత్ర 25-26 రోజుల పాటు ప్రతి పల్లెను, ప్రతి గడపను కలిసేలా సాగుతుంది. ప్రజలందరూ నన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరుతున్నాన అన్నారు..