నన్ను చంపేందుకు కుట్ర : ఈటల
కరీంనగర్, జూలై 19,
మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి కుట్ర పన్నారని తెలిపారు. హంతక ముఠాతో చేతులు కలిపినట్లు తనకు సమాచారం ఉందని పేర్కొన్నారు. నయీం చంపుతానంటేనే తాను భయపడలేదు.. మీరెంత? అని, ఇలాంటి చిల్లర ప్రయత్నాలకు తాను భయపడనని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో సోమవారం ‘ప్రజాదీవెన యాత్ర’ పేరిట ప్రారంభించిన పాదయాత్రలో ఈటల చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని. ఈటల మల్లయ్య కొడుకుని ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా.. దుబ్బాకలో ఏం జరిగిందో అదే హుజుర్నగర్లో జరుగుతుంది. 2018లో నన్ను ఓడించడానికి కుట్రలు చేసినా నా ప్రజలు అండగా నిలిచారు.. ఇప్పుడు నిలుస్తారు. చట్టం మీద నాకు విశ్వాసం ఉంది.. పోలీసులు సహకరించండి’ అని ఈటల రాజేందర్ తెలిపారు. ఉప ఎన్నిక సందర్భంగా ఈటల రాజేందర్ పాదయాత్ర చేపట్టారు. హుజురాబాద్ నియోజకవర్గవ్యాప్తంగా పర్యటించనున్నారు.
చిల్లర రాజకీయాలు ఆపండి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి భయంతోనే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పాదయాత్రకు తెరాస ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తుందని విమర్షించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. అదేవిధంగా, ‘తాము ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదని.. ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నామని’ పేర్కొన్నారు.కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమ గీతం పాడటం ఇక్కడి నుంచే మొదలవుతుందని అన్నారు. తమ పాదయాత్రకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని తెలిపారు. కాగా, ఈ పాదయాత్ర గురించి పదిరోజుల క్రితమే ప్రకటించామని పేర్కొన్నారు. హుజురాబాద్లో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలకు ప్రభుత్వ పథకాలు మీదగ్గర అమలు చేస్తున్నారా.. అని ప్రశ్నించారు. యావత్ తెలంగాణకు విముక్తి కలిగేలా తొలి బీజం ఇక్కడే పడాలని ఈటల అన్నారు. ఇక్కడ తమకు అడ్డంకులు సృష్టిస్తే.. ఖబర్ధార్ అని హెచ్చరించారు.ఇప్పటికైనా కేసీఆర్ చిల్లర వేశాలు మానుకోవాలని ఈటల హితవు పలికారు. కాగా, తన పాదయాత్రకు అండగా ఉండేందుకు అనేక వర్గాల ప్రజలు, అన్ని యూనివర్శిటీలు విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున వచ్చారని పేర్కొన్నారు. ఈ పాదయాత్ర 25-26 రోజుల పాటు ప్రతి పల్లెను, ప్రతి గడపను కలిసేలా సాగుతుందని వివరించారు. ప్రజలందరూ తనను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని ఈటల ఆకాంక్షించారు.