కరీంనగర్
ఓ మంత్రి తనపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నాడంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ భేషుగ్గా ఉంది. కానీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. తనను హత్య చేసేందుకు జిల్లాకు చెందిన మంత్రి కుట్ర చేసాడని ఆయన అంటున్నారు. ఇది కేసీఆర్ ప్రభుత్వం. ఇక్కడ రాజకీయ హత్యలు, దాడులు ఉండవు. ఉంటే గింటే రాజకీయ ఆత్మహత్యలుంటాయి. నీకు చెవిలో ఎవరు చెప్పారో గానీ.. నీకేం భయం లేదు. ఒకవేళ మీమీద హత్యా యత్నం చేస్తే నా ప్రాణం అడ్డం పెట్టి నిన్ను కాపాడుతానని అన్నారు.
నీవు నిండు నూరేళ్లు బతకాలి. నీతో రాజకీయ శతృత్వమే తప్ప వ్యక్తిగత శతృత్వమేమీ లేదు. నీకు, మాకు భూమి పంచాయతీ, ఆస్తి పంచాయతీలు లేవు . మీరు నన్ను ఎంత అన్నా పట్టించుకోము. కానీ కేసీఆర్ ని విమర్శిస్తే మాట్లాడాల్సి ఉంటుంది. నీ వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వానికి మచ్చ తెచ్చేది లాగా, ప్రజలు భయపడే విధంగా ఉన్నాయి. తెలంగాణలో రాజకీయ కక్షలు హత్యలు చేసుకునేదాకా ఉన్నాయా అనే అనుమానాలు ప్రజలకు వస్తాయి. డీజీపీ ఈ విషయంలో వెంటనే విచారణ మొదలు పెట్టాలి. ఈటలకు చెవిలో చెప్పిన మాజీ నక్సలైట్ ను అదుపులోకి తీసుకుని విచారణ జరపాలి. ఆయన వ్యాఖ్యలు నిజమని తేలితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటానని అన్నారు.
నిజం కాకపోతే.. ఓట్ల కోసమో, సానుభూతి కోసమో ఈ మాటలు చెప్పి ఉంటే మీరు తప్పు ఒప్పుకుని రాజకీయాల నుంచి తప్పుకోవాలి. బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు విజ్ఞప్తి చేస్తున్న మీ పార్టీ నాయకుడు ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మీరైనా విచారణ జరిపించండి.
ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ విచారణ మీకు నచ్చకపోవచ్చు. ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించి దోషులను గుర్తించాలి. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ అలాంటి సంస్కృతి లేదు. ఈటల రాజేందర్ తన మనుషులతోనే దాడి చేయించుకుని సానుభూతి పొందే ప్రయత్నం చేసే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. అలాంటి సంఘ విద్రోహశక్తులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నా. ఈటల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇదంతా తేటతెల్లం కావాలి. అందుకే మీకు ఇష్టమున్న కేంద్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలి. లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఆరోపణలు సానుభూతి కోసమో నా మీద ఇలాంటి కేసులు, ఆరోపణలు ఇప్పటి దాకా లేవు. కానీ నీమీద ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఎంత మంది మీద కేసులు పెట్టించావో, ఎందరిని జైలుకు పంపించావో? ఎంతమందికి రోకలి బండలు ఎక్కించావో నీకే తెలియాలి. మంత్రి పేరు నీవు చెప్పలేదు. నీకు ఏ మంత్రి పేరు చెవిలో చెప్పారో ఆ పేరు కూడా బయటపెట్టాలి. ఈటల రాజేందర్ చేసిన ఆరోపణల్లో నిజానిజాలు తేలేదాకా ఈ విచారణ ప్రారంభించేదాకా నేను ప్రతిరోజు అడుగుతూనే ఉంటా. దోషైనా దొరకాలి, లేదంటే ఈటల తప్పు ఒప్పుకోవాలి. మీరు చేయలేకపోతే తనకున్న అనుమానాలపై ఈటల లేఖ ఇస్తే విచారణ జరిపిస్తాం. ఓ దరఖాస్తు ఇస్తే మేమే సీఎంకు చెప్పి దర్యాప్తు స్టార్ట్ చేయిస్తాం. మేమే అసలు నిజాలు బయటపెడ్తాం. ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు. తెలంగాణలో లేని సంస్కృతికి మీరు తెరలేపే ప్రయత్నం చేస్తున్నారా? ఓట్ల కోసం ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా? ఈటల రాజేందర్ ఓడిపోతాడని ఆయనకు తెలిసిపోయింది. అందుకే కొత్త డ్రామాకు ఆయన తెరతీసాడు. ప్రజలు కూడా ఈటలను పాదయాత్రలో అడగాలి. నిన్ను చంపాలని చూసిన మంత్రెవరని అడుగుతూనే ఉండాలి. ప్రపంచంలోనే గొప్ప పథకం రైతు బంధు.. అలాంటి పవిత్ర పథకం హుజురాబాద్ లో ప్రారంభించడం వల్ల సక్సెస్ అయింది. అలాంటి పవిత్రమైన దళిత బంధు కూడా రైతు బంధులాగా సక్సెస్ చేయాలని హుజురాబాద్ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారని అన్నారు.
ఈ నిర్ణయం ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే తీసుకున్నారు. దళితులకు మేలు చేయాలన్న పథకం తేవాలని ఈటల మంత్రిగా ఉన్నప్పుడే తీసుకున్నారు. ఈ ఎన్నికలకు దళితబంధు పథకానికి సంబంధం లేదు. కలెక్టర్ బదిలీ వెనక ఎలాంటి కారణం లేదు. మాకు అధికారులు సహకరించేదీ ఉండదు. దళిత బంధు అద్భుతంగా టేకాఫ్ చేయాలంటే... దళితుల మీద ప్రేమ ఉన్న అధికారులను నియమించాలన్నది ఆలోచన. హుజురాబాద్ లో ఎవరికి టికెట్ ఇచ్చినా వారిలో కేసీఆర్ ను చూసుకుంటాం. ప్రజలు కూడా అదే విధంగా ఓటేస్తారు. పెద్దమ్మ తల్లికి దండం పెట్టి కోరుకుంటున్నా ఈటల రాజేందర్ క్షేమంగా ఉండాలి. హుజురాబాద్ లో, జమ్మికుంట పట్టణాలను ఈటల అభివృద్ధి చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఆ బాధ్యత మేం తీసుకున్నాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది.. ఒక్క హుజురాబాద్ ఎందుకు చెందలేదు. ఆయన నియోజకవర్గంలో ఏ సమస్యలున్నాయో ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి నిధులు తెచ్చుకోవడంలో ఈటల విఫలమయ్యారు. ఏ పెద్ద కార్యక్రమం తీసుకున్నా లోపాలు గుర్తించేందుకు పైలట్ ప్రాజెక్టు చేపడుతారు. అందుకే హుజురాబాద్ ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసామని అన్నారు