అక్రమ లేఅవుట్లు పై కఠిన చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్
హైదరాబాద్
రాష్ట్రంలో వివిధ మున్సిపాలిటీలో ఉన్న అక్రమ లేఅవుట్లు పై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం లే అవుట్ ఆడిట్, తెలంగాణకు హరితహారం, తదితర అంశాల పై జిల్లా కలెక్టర్లు,అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ మరియు సంబంధిత అధికారులతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు పట్టణాభివృద్ది దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రిన్సిపాల్ సెక్రటరీ సూచించారు.నూతన మున్సిపాల్ చట్టంలో స్పష్టంగా పేర్కోన్నప్పటికి అక్రమ లేఅవుట్లు రాష్ట్రంలో పలు చోట్ల వస్తున్నట్లు సమాచారం అందుతుందని, దీని పై అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతిలలో, మున్సిపాల్టీలో ఉన్న లేఅవుట్ వివరాలను ముందుగా సేకరించాలని ఆయన సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా లేఅవుట్ ఆడిట్ జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం లేఅవుట్ పరిధిలో 10 శాతం స్థలం తప్పనిసరిగా ఓపెన్ ల్యాండ్ స్పేస్ ఉంచాలని ఆయన తెలిపారు. నిబంధనల మేరకు లేఅవుట్లలో 10 శాతం ఓపెన్ స్థలం స్థానిక సంస్థల పేరు మీద రిజీస్టర్ కాకపోతే సదరు లేఅవుట్ డెవలపర్ వద్ద నుండి భారీ జరిమానా వసూళ్లు చెయాలని ఆయన ఆదేశించారు.
నూతన మున్సిపల్ చట్టం 2019 వచ్చిన తరువాత ప్రారంభించిన లేఅవుట్ వివరాలు సేకరించి, అందులో తప్పనిసరిగా నిబంధనల ప్రకారం ఓపెన్ స్పేస్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. లేఅవుట్ అనుమతులు జిల్లా స్థాయిలో ఉండే కమిటి మాత్రమే అందిస్తుందని ఆయన స్పష్టం చేసారు. ప్రభుత్వ అనుమతులు పొందకుండా ఉన్న లేఅవుట్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. లేఅవుట్ అనుమతించే సమయంలో ఓపెన్ ల్యాండ్ ను సదరు మున్సిపాల్టీ పేరిట రిజిస్టర్ చేయాలని ఆయన సూచించారు.
మున్సిపాల్టీ పేరిట రిజీస్టర్ అయిన భూమిలో బోర్డు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటే విధంగా ప్రణాళిక సిద్దం చేయాలని సూచించారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం లేఅవుట్ లకు అనుమతి తప్పనిసరి అని, అయినప్పటికి కొన్ని అనుమతి లేని లేఅవుట్లు వస్తున్నాయని తెలిపారు. జిల్లాలోని ప్రతి మున్సిపాల్టీకి 2 కిమి రేడియస్ పరిధిలో పర్యటించి లేఅవుట్ వివరాలు సేకరించాలని, అనుమతి లేని అక్రమ లేఅవుట్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతి పట్టణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, ప్రణాళికాబద్దంగా ప్రతి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రాల్లో పూర్తవుతున్న నూతన సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో సైతం పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచాలని సూచించారు. సీఎం కేసిఆర్ క్షేత్రస్థాయి పర్యటనలు చేపడతారని, ఆయన పర్యటన సమయంలో మొక్కల పెంపకం సరిగ్గా లేకపోతే సంబంధిత అధికారులను విధుల నుండి తొలగించుటకు సైతం అవకాశం ఉందని ఆయన స్పష్టం చేసారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మున్సిపాల్టీ తమ పరిధిలో ఉన్న ప్రతి ఆస్తి వివరాలు నమోదు చేయాలని, మున్సిపాల్టీ పరిధిలో ఉన్న భూములు, భవనాలు, వాహనాలు, కార్యాలయ సామాగ్రి వంటి అన్ని వివరాలతో కూడిన ఇన్ వెంటరీ తయారు చేయాలని ఆయన సూచించరు. అత్యంత పారదర్శకంగా భవన అనుమతులు అందించేందుకు ప్రబుత్వం టి బీపాస్ ప్రవేశపెట్టిందని, ఇప్పటికి టౌన్ ప్లానింగ్ విభాగంలో కొంత మంది అధికారుల పై అవినితి ఆరోపణలు వస్తున్నాయని ఆయన విచారణ వ్యక్తం చేసారు. అవినితీకి పాల్పడే అధికారులను సర్విసు నుండి తొలగించడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రిన్సిపాల్ సెక్రటరీ హెచ్చరించారు.
టి-బీపాస్ ద్వారా 75 గజాల వరకు అనుమతి అవసరం లేదని, 75 నుంచి 600 గజాల వరకు దరఖాస్తు చేసుకొని 15 రోజులో అనుమతులు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి మున్సిపాల్టీలలో టి-బిపాస్ ద్వారా అనుమతించిన భవనాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని, అనుమతి పొందిన సమయంలో సూచించిన ప్లాన్ ప్రకారమే నిర్మాణం జరిగిందో లేదో పరిశీలించాలని సూచించారు. అనుమతి పొందే సమయానికి, నిర్మాణానికి వ్యత్యాసాలు ఉన్నట్లయితే చట్టం ప్రకారం సదరు నిర్మాణం నిర్మూలించాలని లేదా అత్యధికంగా భారీ జరిమానా విధించాలని ఆదేశించారు. భవన నిర్మాణాలో జరుగుతున్న అవకతవకల పై సీఎం కేసిఆర్ మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ ఆగ్రహంతో ఉన్నారని, నిరంతరం పట్టణాలో నిర్మాణాల తనిఖీ జరగాలని మంత్రి సూచించారని ఆయన తెలిపారు.
జిల్లాలోని ప్రతి మున్సిపాల్టీలలో పారిశుద్ద్య నిర్వహణ మెరుగుపర్చుకోవాలని, ప్రతి రోజు 100 శాతం ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలని ఆయన సూచించారు. పట్టణాలలో పూర్తి స్థాయిలో విద్యత్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళిక సిద్దం చేసుకోవాలని, ఇంటి పై నుండి వెళ్లే హై టెన్షన్ వైర్లు తొలగించే దిశగా చర్యలు తుకోవాలని అన్నారు. ప్రతి మున్సిపాల్టీలో వైకుంఠదామం, పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని, దీని కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని, 2 మాసాల్లో వైకుంఠదామ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం ప్రిన్సిపాల్ సెక్రటరీ భవిష్యత్తులో ల్యాండ్ పూలింగ్ విధానం అత్యంత ప్రాముఖ్యత పొందుతుందని, దీని పై త్వరలో జిల్లా స్థాయిలో అధికారులకు ఒక రోజు ఒరియెంటేషన్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందని తెలిపారు.