హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేత
హైదరాబాద్, జూలై 20,
నగర శివారులోని హిమాయత్ సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అధికారులతో కలిసి ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి హిమాయత్ సాగర్కు భారీగా వరద వచ్చి చేరడంతో జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. వర్షాలు కురుస్తుండటంతో మరింత వరద వచ్చే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నదిలోకి నీటిని విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. హిమాయత్నగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.90 అడుగులుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1250 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది.