కరీంనగర్, జూలై 22,
హుజూరాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాకముందే రాజకీయ సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నికల వేడి ఇప్పటికే స్టార్ట్ అయిపోగా.. మాజీ మంత్రి ఈటల కూడా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఎలాగైనా టీఆర్ఎస్ను ఓడించాలనే నిశ్చయంతో ఈటల రాజేందర్.. బీజేపీ నుంచి బరిలోకి దిగుతుండగా ఈటలను ఓడించేందుకు పక్కా ప్రణాళికగా గులాబీ పార్టీ ముందుకెళ్తుంది.ఈ క్రమంలోనే తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న నాయకులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి ఈటలతో చర్చించడం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. గంటకు పైగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డిలు ఈటలతో కారులోనే సమావేశం అయ్యారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డిలు లాంటి ఇద్దరు మాజీ ఎంపీలు ఈటలను కలవడం రాజకీయంగా కొత్త చర్చకు కారణం అయ్యింది.ఇటీవలే కాంగ్రెస్లో పీసీసీ అయిన రేవంత్ రెడ్డి నాయకత్వానికి మద్దతు తెలిపారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రేవంత్ నాయకత్వానికి సపోర్ట్ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటల పాదయాత్రలో కనిపించడం విశేషం. అయితే, అంతకుముందే కొండా విశ్వేశ్వర్ రెడ్డి హుజురాబాద్ ఎన్నికలు పార్టీల మధ్య పోటీ కాదని, కేసీఆర్, ఈటల రాజేందర్కు మధ్యే పోటీ అని అభిప్రాయపడ్డారు.అయితే, ప్రస్తుత పరిస్థితిని చూస్తొంటే, లోలోపల అన్నీ పార్టీల నాయకులు ఈటల రాజేందర్కు మద్దతు ప్రకటిస్తున్నట్లుగా అర్థం అవుతోంది. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులు మొత్తం ఈటలకు సపోర్ట్ చేస్తున్నారు.