హైదరాబాద్, జూలై 23,
ఐపీఎస్ అధికారి, మాజీ తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ అరంగేట్రానికి కసరత్తులు మొదలయ్యాయి. ఆరేళ్ల సర్వీసు ఉండగానే స్వచ్చంద పదవీ విరమణ కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న ఈ ఐపీఎస్ గురుకులాల కార్యదర్శిగా తనదైన ముద్ర వేసి… తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు. పదవికి రాజీనామా చేసిన సమయంలో ఇకపై తన అడుగులు రాజకీయాల్లోకే అని చెప్పకనే చెప్పేశారు.అదే సమయంలో హుజురాబాద్ ఉపఎన్నిక ముంగిట్లో ఆయన రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే.. హుజురాబాద్ ఎన్నికకు.. తనకు సంబంధం లేదని.. అక్కడ నుండి పోటీచేయబోనని కూడా ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. అయితే తన రాజకీయ ప్రయాణానికి అడుగులు మాత్రం మొదలు పెట్టారు. ఇప్పటికే రాష్టవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలతో ప్రవీణ్ కుమార్ చర్చలు జరిపారు.అయితే, బీఎస్పీ వైపు వెళ్లాలా.. సొంత పార్టీ పెట్టాలా.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఏదైనా పార్టీలో చేరాలా.. అన్న దానిపై విస్తృత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా తమ వెంట ఉంటామని ఉద్యోగ సంఘాలు హామీ ఇచ్చినట్లు తెలుస్తుండగా.. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం స్వచ్ఛంద పదవి విరమణ ఆమోదించింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైల్ ను కేంద్ర కి పంపించగా.. అక్కడ లైన్ క్లియర్ అయ్యాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.దళిత హక్కుల కోసం కాన్షిరాం, జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ఆదేశాల ప్రకారం ప్రజలకు సేవ చేస్తానన్న ప్రవీణ్ కుమార్ దళిత్ అన్న పదానికి కొత్త నిర్వచనం ఇవ్వబోతున్నారా అనే చర్చలు రాజకీయ వర్గాలలో ముమ్మరంగా జరుగుతున్నాయి. సమాజంలో అణచివేతకు గురైన ప్రతీ ఒక్కరూ దళితుడే అన్న కొత్త నినాదంతో ప్రవీణ్ కుమార్ ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. గతంలో ఇదే బాటలో నడిచిన కాన్షీరాం కూడా దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందగా ప్రవీణ్ కుమార్ ప్రయాణం ఆసక్తికరంగా మారింది.బీఎస్పీలో చేరాలని ప్రవీణ్ కుమార్ అనుచరులు సూచిస్తున్నట్లు తెలుస్తుండగా.. దీనిపై విస్తృత చర్చలు జరుపుతున్నారట. బహుజనులే కేంద్ర బిందువుగా కొత్త పార్టీ రావాల్సి ఉందని మాజీ అడిషనల్డీజీ ఆర్ఎస్ప్రవీణ్ కుమార్చెప్పారు. బహుజనులకు జ్ఞాన యుద్ధం చాలా అవసరమని, బహుజనుల ప్రయోజనాల కోసం ఉండే సిద్ధాంతం వైపు తాను ఉంటానని స్పష్టంచేశారు. తెలంగాణలో బహుజనులకు న్యాయం జరుగలేదని, దాని కోసమే బయటకు వచ్చానన్నారు. అయితే, తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమేనని, కానీ ఎప్పుడు వస్తానో ఇప్పుడే చెప్పలేనన్నారు. ఓ టీవీ చానల్ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 99 శాతం బహుజనుల సంక్షేమం కోసమే తాను ఐపీఎస్పదవిని వదిలివేశానని, ఈ ఆరేండ్లు సమయం వృథా చేయదల్చుకోలేదన్నారు. కేవలం 1 శాతం మంది దగ్గరే సంపద నిక్లిప్తమై ఉందని, 99 శాతం ప్రజలు ఇంకా ప్రభుత్వ తాయిలాలకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.దళితులకు మూడెకరాలు, పేదలకు ఇండ్లు, రజకులకు ఉచిత విద్యుత్అనేవి అవసరం లేదని, వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకురావడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ఇప్పటివరకు కేవలం తనకున్న పరిమితులతో ఒక అధికారిగా మాత్రమే పని చేశానని, ఇక నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. సాంఘీక సంక్షేమశాఖ గురుకులాల్లో అక్రమాలకు తావులేదన్నారు. ప్రభుత్వానికి నష్టం జరిగితే, ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు తేలితే ఉరికంభం ఎక్కడానికైనా తాను సిద్ధమేనని తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీ నుంచి పిలుపు రాలేదని తేల్చి చెప్పారు. తనను ఏడేండ్లుగా ఒకే సీట్లో కూర్చుండబెట్టడం రాజ్యాంగ బద్ధమని, కొన్ని చోట్ల ఇంకా రిటైరైన వాళ్లు కూడా కీలక పోస్టుల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. దళిత బంధు చర్చలో తనకు పిలుపు లేదని, దాని గురించి ఇప్పుడేం మాట్లాడనని ప్రవీణ్కుమార్ చెప్పుకొచ్చారు.గతంలో వీకేసింగ్, జేడీ లక్ష్మినారాయణ, దినేశ్రెడ్డి, విజయరామారావులు వంటి వారు రాజకీయాల వైపు వచ్చిన తర్వాత గ్రౌండ్ కోసం వెతుక్కుంటే.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని రాజకీయాల్లోకి దిగుతున్నట్లుగా కనిపిస్తుంది. మరి ఈయన ప్రయాణం ఎలా ఉంటుందో చూడాలి.