వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కురవడంతో కొద్దిసేపు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్ నగరంలో రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో రవాణ, విద్యుత్ వ్యవస్థలు స్థంబించాయి. మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, ములుగు, వర్గల్ మండలాల్లో భారీ వర్షం పడింది. వరంగల్ అర్బన్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం ధాటికి విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. రోడ్లపైన విరిగిపడ్డ చెట్లను తొలగించి, విద్యుత్ స్తంబాలు, తీగలను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి, నగర కమీషనర్ గౌతమ్ అధికారులను ఆదేశించారు.నగరంలో చెట్లు, విద్యుత్ తీగలు, స్థంబాలు పడిపోతే కార్పొరేషన్ అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ ఆమ్రపాలి నగర ప్రజలను కోరారు. టోల్ ఫ్రీ నెంబర్ 8004251980 నెంబర్ కి కాల్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. యాదాద్రి భువనగిరి రాజాపేటలో, జనగాం జిల్లా కేంద్రంతోపాటు పలు మండలాల్లో ఉరుములు, మెరువులతో కూడిన వర్షం కురుసింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం తడిసి ముద్దయింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అకాల వర్షం ధాటికి వరి, మక్క, మామిడి తోటలు దెబ్బతిన్నాయి.వరంగల్ అర్బన్ 5 సెం.మీ, వరంగల్ రూరల్ 4 సెం.మీ, భూపాలపల్లి 4 సెం.మీ, దామెర, ములుగు 3.6 సెం.మీ వర్షపాతం, వేంసూరు (ఖమ్మం)3.3, ఉప్పలగూడెం (మహబూబాబాద్) 2.1 సెం.మీ, వర్షంపాతం నమోదయింది.