వృద్ధుల పెన్షన్కు సంబంధించిన 'ప్రధానమంత్రి వయ వందనా యోజన (పీఎంవీవీవై)' పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ పథకం కింద ఇంతవరకు ఉన్న రూ.7.5లక్షల పరిమితిని రూ.15 లక్షల వరకు పెంచింది. ఈ పెట్టుబడుల పరిమితులపై 8 శాతం వడ్డీ కూడా చెల్లిస్తోంది. తాజా పెంపుతో వృద్ధులకు నెలకు గరిష్ఠంగా రూ.10,000 పెన్షన్ అందనుంది. మరోపక్క ఈ పథకం కింద డిపాజిట్ చేసుకునే గడువు మే 4తో ముగుస్తుండగా... ఇప్పుడు ఆ గడువును రెండేళ్ల వరకు పొడిగించారు. అంటే 2020 మార్చి 31 వరకు డిపాజిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో మరింత మంది వృద్ధులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.. పీఎంవీవీవై పథకంలో భాగంగా మార్చి వరకు మొత్తం 2.23 లక్షల మంది వృద్ధులకు లబ్ధి చేకూరినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం 60 ఏళ్లు దాటిన భారతీయులకు మాత్రమే. 10 ఏళ్ల కాలానికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో భాగస్వాములు కావడానికి ఎలాంటి వైద్యపరీక్షలు అవసరం లేదు. ఎల్ఐసీ ఇండియా ఈ పథకం నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షిస్తోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం వడ్డీరేట్ల తగ్గుదల నుంచి సీనియర్ సిటిజన్లను కాపాడటమే. వీరికి 8 శాతం వడ్డీనే 10 సంవత్సరాలపాటు వర్తిస్తుంది. నెల, మూడు నెలలు, ఆరునెలలు, సంవత్సర ఫించను పథకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రతినెల పెన్షన్ కావాలనుకునే వారు నెలకు గరిష్ఠంగా రూ.10,000, మూడునెలలకోసారి పెన్షన్ కావాలనుకునే వారు నెలకు గరిష్ఠంగా రూ.30,000, ఆరు నెలలకోసారి పెన్షన్ కావాలనుకునే వారు నెలకు గరిష్ఠంగా రూ.60,000, సంవత్సరానికోసారి పెన్షన్ కోరుకునేవారు గరిష్ఠంగా రూ.1,20,000 పొందుతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే 5 నుంచి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టే వృద్ధులకు గరిష్టంగా 7.25 శాతం వడ్డీని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కచ్చితమైన రాబడికి ఉపకరిస్తుందని, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఈ పథకం అధిక రాబడిని అందిస్తోందని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.