యాదాద్రి భువనగిరిజిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీ పేట గ్రామ శివారులో గల వరంగల్ హెద్రబాద్ 163వ జాతీయ రహదారి పై ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన టిప్పర్ లారీ వరంగల్ జిల్లా కు చెందిన కారును బలంగా డీ కొనడంతో ఓలా టాక్సీ నడుపుతున్న శ్రీకాంత్(40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వరంగల్ హైద్రాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న తరుణంలో రోడ్డు కాంట్రాక్టర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా హెచ్చరిక సూచికలు పెట్టకుండా రోడ్డు విస్తరణ చేపడుతుండటంపై స్థానికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు జాతీయ రహదారి మృత్యు రహదారిగా మారడంతో ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణం చేయవలసి వస్తుందని అంటున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని తెలియని పరిస్థితి వుందని అంటున్నారు. ఇటీవల వారం రోజుల వ్యవధిలోనే ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇన్ని ప్రమాదాలు జరిగిన ఆర్ అండ్ బీ అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జాతీయ రహదారిపై చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా నిర్మాణం చేసి సూచిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.