రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని దండుమైలారంలో గతకొంత కాలంగా చిరుత పులులు సంచరిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా దండుమైలారం అటవీ ప్రాంతంలో చిరుత పులులు సంచరిస్తూ గొర్రెలు, మేకలు, లెగదుడలను చంపేస్తున్నాయి. తాజాగా ఒక గొర్రెల మందపై దాడి రెండు గొర్రెలను చంపి తినడంతో గ్రామస్థులు చిరుత భయాందోళనకు గురవుతున్నారు. దండుమైలారం రైతుల పొలం లోని గొర్రెల మంద వద్దకు వచ్చిన చిరుత గొర్రెల పై దాడికి తెగబడింది. చిరుత సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులకు గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. రాచకొండ అటవీ ప్రాంతం నుండి పులులు వ్యవసాయ పొలాల వద్దకు వచ్చి పశువులను, గొర్రెలు, మేకలను తింటుండడం ఇక్కడి రైతులకు కంటినిండా కునుకు లేకుండా పోతోంది. ప్రతి రోజు రాత్రి సమయంలో కూడా గొర్రెల మందల వద్దనే పడుకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. అటవీ శాఖ రేంజ్ అధికారి దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ దాదాపు నాలుగు ఐదు చిరుతలు తిరుగుతునట్లు గుర్తించామని తెలిపారు..