గుంటూరు, ఆగస్టు 2,
తెలుగుదేశం పార్టీలో కోవర్టుల కలకలం రేగుతుంది. పార్టీలోనే ఉంటూ అధికార వైసీపీకి సహకరించేవారు ఉన్నారన్న అనుమానం నిజమవుతుంది. ఇటీవల వరసగా జరుగుతున్న అనేక సంఘటనలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లో జరుగుతున్న విషయాలు కూడా బయటకు లీకవుతుండటంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సాంకేతిక సిబ్బంది వరకూ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు ఉన్న తెలుగుదేశం పార్టీకి నాయకత్వ సమస్య వెంటాడుతుంది. చంద్రబాబు తర్వాత ఎవరు? అన్న ప్రశ్న సీనియర్ నేతల నుంచి జూనియర్ ల వరకూ వేధిస్తుంది. అధికారం కోల్పోయిన రెండేళ్లలో నేతలంతా పెద్దగా యాక్టివ్ గా లేరు. అలాగని పక్క చూపులు చూడటం లేదు. ఎన్నికల సమయానికి నియోజకవర్గాల్లో చెలరేగిపోతామని వారు సమావేశాల్లో చెబుతున్నారు.అయితే ఇటీవల కాలంలో పార్టీ అంతర్గతంగా జరుగుతున్న చర్చలు కూడా లీకవుతున్నాయి. ఇది చంద్రబాబుకు ఆందోళన కల్గిస్తుంది. ఇటీవల కాలంలో కరోనా కారణంగా చంద్రబాబు ఎక్కువగా జూమ్ మీటింగ్ లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో కెమెరా ఆఫ్ అయినా వీడియోలు మాత్రం బయటకు వస్తుండటం కలవర పరుస్తుంది. కొందరు కావాలని పనిగట్టుకుని నేతల సంభాషణలను సోషల్ మీడియాలో పెడుతున్నారని అనుమానిస్తున్నారు.ఇందుకు సాంకేతిక సిబ్బంది సహకారం ఉండి ఉండవచ్చని కూడా టీడీపీ నేతల్లో సందేహం ఉంది. అందుకే చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తన వద్ద పనిచేస్తున్న సాంకేతిక సిబ్బంది విషయంలో జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నారు. రాజధాని అమరావతి భూ కుంభకోణం కేసులో కూడా వైసీపీ నేతలకు ఉప్పందించింది కూడా టీడీపీ నేతలేనన్న అనుమానం ఉంది. దీంతో చంద్రబాబు మరింత అప్రమత్తమయ్యారు. మరి టీడీపీలో కోవర్టులు ఎవరు? అన్న దానిపై పార్టీ అంతర్గతంగా విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది
మళ్లి కొత్త కష్టాలు
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఏపీ అధికార పక్షం వైసీపీపై పైచేయి సాధించేందుకు ఉన్న ఏకైక వేదిక శాసన మండలి. 2019 ఎన్నికలలో కేవలం 23 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే పరిమితమైన టీడీపీ.. వీరిలోనూ నలుగురిని నిలబెట్టుకోలేక పోయింది. దీంతో అసెంబ్లీలో వైసీపీదే పైచేయి అయింది. దీంతో ఏం మాట్లాడినా.. అసెంబ్లీలో టీడీపీకి వాయిస్ ఉండడం లేదు. పైగా స్పీకర్ నుంచి ఎదురవుతున్న సస్పెన్షన్లు, అరెస్టులు కామన్గా మారిపోయాయి. దీంతో టీడీపీ అసెంబ్లీలో జీరో అయిపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అయితే.. శాసన మండలిలో మాత్రం టీడీపీ బలంగా ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో పాటు భారీ సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకున్న నేపథ్యంలో మండలిలో గణనీయంగా టీడీపీకి ప్రాధాన్యం లభించింది. దీంతో వైసీపీ సర్కారుకు 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా మూడు రాజధానులు, ఏపీ సీఆర్ డీఏ చట్టం రద్దు వంటి కీలక నిర్ణయాల విషయంలో మండలిలో టీడీపీ నుంచి తీవ్ర వ్యతిరేక త ఎదురైంది. ఈ క్రమంలోనే తీవ్ర అసహనానికి గురైన సీఎం జగన్.. మండలి రద్దుకు ప్రతిపాదించారుఇలా.. అటు అసెంబ్లీలో కాకపోయినా.. మండలిలో అయినా టీడీపీ.. అధికార వైసీపీపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించింది. అయితే.. ఇప్పుడు రాను రాను మండలిలో టీడీపీ నేతలు తగ్గిపోతున్నారు. ఈ ఒక్క నెలలోనే శాసన సభ్యుల కోటాలో మూడు సీట్లు ఖాళీ అవగా.. గవర్నర్ కోటాలో నాలుగు స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ ఖాళీ అయిన సీట్లన్నీ కూడా టీడీపీవే కావడం గమనార్హం. ఇక, ఇటీవలే మండలి చైర్మన్ కూడా రిటైరయ్యారు. సో.. దీంతో టీడీపీకి పెద్దల సభలో వాయిస్ తగ్గిపోతోంది.మరో మూడు మాసాల్లో.. వైసీపీ బలం మరింత పెరగనుంది. దీంతో టీడీపీ వాయిస్ పూర్తిగా సన్నగిల్లడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం వాయిస్ బాగానే వినిపిస్తున్న నారా లోకేష్కు నిన్నటి వరకు చేదోడుగా ఉన్న నేతలు కూడా రిటైర్ అవుతుండడంతో మండలిలో లోకేష్ వాయిస్ కూడా తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. సో.. మొత్తంగా 2019 ఎన్నికల్లో తగిలిన దెబ్బ తాలూకు గాయాలు.. టీడీపీని మరింత వేధించనున్నాయన్న మాట.. అంటున్నారు పరిశీలకులు.