YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ ఎంపీలపై బీజేపీ కన్ను

వైసీపీ ఎంపీలపై బీజేపీ కన్ను

విజయవాడ, ఆగస్టు 3, 
వైసీపీకి ఈసారి పాతిక ఎంపీ సీట్లు వస్తాయా. అంటే అవును అన్న మాట సొంత పార్టీలో వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుచుకున్న 22 సీట్లతో పాటు టీడీపీ సీట్లు మూడింటినీ కూడా గెలుచుకోవడానికి వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఏపీలో టీడీపీని తుడిచిపెట్టేస్తామని కూడా ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉన్నపుడూ ఫెయిల్ అయ్యారు. విపక్షంలోకి వచ్చాక కూడా ఇంకా దారుణంగా విఫలమయ్యారని వైసీపీ అంచనా వేస్తోంది. వైసీపీ పాలన సగానికి వచ్చినా కూడా ఎక్కడా ప్రజా వ్యతిరేకత లేదని వారు గుర్తుచేస్తున్నారు. ఇదే తీరున జగన్ దూకుడుగా ముందుకు సాగుతారని, వచ్చే ఎన్నికలు టీడీపీకి కీలకం కాబట్టి ఆ పార్టీని ఏపీ రాజకీయ తెర మీద నుంచి లేకుండా చేయడమే వైసీపీ టార్గెట్ అంటున్నారు. ఇక తిరుప‌తి ఉప ఎన్నిక‌తో పాటు ఇటీవ‌ల జ‌రిగిన స‌ర్పంచ్‌, మున్సిప‌ల్‌, కార్పొరేష‌న్ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద తాడిప‌త్రి మిన‌హా ఎక్కడా టీడీపీ గెల‌వలేదు. ఇదే త‌మ ప్రభుత్వంపై చిన్న వ్యతిరేక‌త కూడా లేద‌ని చెప్పేందుకు నిద‌ర్శనం అని అంటున్నారు. చంద్రబాబుకు చివరి ఎన్నికలను చేదు అనుభవంగా మిగిల్చి టీడీపీని శాశ్వతంగా లేకుండా చేయాలన్నదే ఇపుడు వైసీపీ వ్యూహంగా ఉందట. మరి ఏపీలో పాతిక ఎంపీ సీట్లు ఎందుకు గెలుస్తామో కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ రాదు అంటున్నారు. మోడీ పట్ల గతంలో ఉన్న మోజు జనాలలో బాగా తగ్గిందని, అందువల్ల ఈసారి ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు వస్తే గొప్ప అంటున్నారు. అపుడు కచ్చితంగా ఏపీలోని పాతిక సీట్లు కీలకం అవుతాయని కూడా లెక్కలు వేస్తున్నారు. అలా బీజేపీకి మద్దతు ఇచ్చి ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను తెచ్చుకోవడం పైనే జగన్ దృష్టి సారిస్తారు అన్నది వైసీపీ నేతల మాటగా ఉంది. ఇక ఏపీలో రాజకీయ పరిస్థితి మీద బీజేపీ కూడా అంతర్గతంగా సర్వే జరిపించుకుందని అంటున్నారు. ఏపీలో టీడీపీ పరిస్థితి క్షేత్ర స్థాయిలో దారుణంగా ఉందని అంటున్నారు. అదే సమయంలో వైసీపీ బలంగా ఉందని బీజపీ కేంద్ర పెద్దలకు నివేదికలు అందాయట. అందుకే వారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ తో సావాసం చేయాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. బాబుతో పోలిస్తే జగన్ లో ఉన్నది విశ్వసనీయత. మాట ఇస్తే వెనక్కు పోరని, మిత్రులను కాదని ముందుకు వెళ్లరని బీజేపీ నేతలు నమ్ముతున్నారు. అన్నింటికీ మించి వైసీపీ అధినేత జగన్ యాంటీ కాంగ్రెస్ అన్నదే బీజేపీకి బాగా నచ్చుతోందిట. దేశంలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని బీజేపీ ఎలా కోరుకుంటుందో జగన్ కూడా అలాగే కోరుకుంటున్నారుట. దాంతో తమకు సీట్లు తగ్గినా కూడా జగన్ భరోసాగా ఉంటారని బీజేపీ పెద్దలు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఇటీవ‌ల అనేక అంశాల్లో జ‌గ‌న్ ప‌ట్ల చూసీ చూడ‌ని ధోర‌ణితో కేంద్రం ఉంటోందంటున్నారు.

Related Posts