హైదరాబాద్, ఆగస్టు 3,
ఎదుటి వారిని నమ్మించడానికి ‘ఒట్టేసి’ చెబుతారు కొందరు. మరికొన్నిచోట్ల ఇష్టదైవాలపై ప్రమాణాలు చేయిస్తారు. ఒట్లు.. ప్రమాణాలు లేకపోయినా.. ఇటీవల కాలంలో ఆ జాతీయ పార్టీ నాయకుల ఢిల్లీ ప్రయాణం ఇంచుమించు అలాగే ఉందట. పైగా కీలక నేతలు ఎస్కార్ట్గా వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణ బీజేపీలో రెండేళ్లుగా వివిధ పార్టీల నుంచి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్దసంఖ్యలో చేరారు. ఇటీవల ఆ చేరికలు నెమ్మదించాయి. కానీ.. వలస వచ్చిన నేతలు.. గుడ్బై చెబుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులు.. ఒక మాజీ ఎమ్మెల్యే బీజేపీకి రాంరాం చెప్పారు. ఇలా ఒక్కొక్కరుగా కాషాయ శిబిరం నుంచి చేజారిపోతుండటంతో కమలనాథులు అలర్ట్ అయ్యారు. బీజేపీ నుంచి వెళ్లేవారివల్ల పార్టీకి నష్టమా.. లాభమా అనేది పక్కన పెడితే.. జరుగుతున్న పరిణామాలు రాంగ్ సిగ్నల్ పంపుతాయని నాయకులు కలవరం చెందారట. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఈ అంశంపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఆ తర్వాత పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు తీసుకున్న చర్యలే ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.బీజేపీలోని వలస నాయకులపై టీఆర్ఎస్, కాంగ్రెస్ గురిపెట్టాయి. కొన్ని పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వారు వెళ్తారో లేదో కానీ.. బండి సంజయ్ అంట్ టీమ్ గత రెండేళ్లుగా పార్టీలో చేరిన వారితో మాట్లాడటం మొదలుపెట్టింది. ముఖ్యంగా యువనేత వీరేంద్రగౌడ్ ఇంటికి రేవంత్, మధుయాష్కీలు వెళ్లి మాట్లాడిన తర్వాత.. బీజేపీలో పరిస్థితిని చక్క దిద్దేందుకు వేగంగా పావులు కదిపినట్టు తెలుస్తోంది. రేవంత్తో భేటీ తర్వాత వీరేంద్రగౌడ్.. నేరుగా ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసివచ్చారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్లతో ప్రత్యేకంగా మాట్లాడారు కూడా. ఆ విధంగా తాను పార్టీ మారడం లేదన్న సంకేతాలు పంపించారు వీరేంద్రగౌడ్ఎవరిపేర్లు అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయో.. వారిని తీసుకుని బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లడం మొదలుపెట్టారు. పెద్దిరెడ్డితోపాటు పార్టీని వీడతారని అనుకున్న మాజీ ఎంపీ చాడా సురేష్రెడ్డి..మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్లను వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, శేరిలింగంపల్లి నాయకుడు రవియాదవ్లు కూడా ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. బీజేపీ ఎంపీ ఒకరు వారిని హస్తినలో పార్టీ పెద్దలతో మాట్లాడించారు. మాజీ మంత్రి ముఖేష్గౌడ్ కుమారుడు విక్రంగౌడ్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఢిల్లీ తీసుకెళ్లారు. పార్టీ మారడం లేదని క్లారిటీ ఇవ్వడం ఒక అంశమైతే.. ఢిల్లీ పెద్దలతో మాట్లాడిస్తే.. వలస నేతలు ధైర్యంగా ఉంటారనే లెక్కలు ఈ టూర్ల వెనక ఉన్నాయట. ఒట్టు వేయించుకోవడం.. ప్రమాణాలు చేయించుకోవడం తప్ప నమ్మకం కుదిర్చేలా చేతులు కలిపి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారట.మొత్తానికి బీజేపీ నుంచి కొందరు వెళ్లిపోవడం వల్ల.. పార్టీలో ఎలాంటి పదవులు లేక.. గుర్తింపు లభించక ఉస్సూరుమంటున్న వలస నేతలపై ఒక్కసారిగా కమలనాథులు ఫోకస్ పెట్టారు. అయితే ఇక్కడ ఇంకో చర్చ కూడా జరుగుతోంది. పార్టీ మారుతున్నారని జరుగుతోన్న ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టడానికి ఢిల్లీ వెళ్లారా లేక తమ అసంతృప్తిని తెలపడానికి ఈ టూర్ను ఉపయోగించుకున్నారా అన్నది ప్రశ్నగానే ఉందట.